ఈ మెయిల్స్ మాయం చేసిన లలిత్ మోదీ సెక్రటరి
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సంబంధించి ఒక్కోక్క విషయం బయటకు వస్తున్నది. ఆయన పర్సనల్ సెక్రటరి లలిత్ మోదీకి సంబంధించిన ఈ మెయిల్స్ ను పూర్తిగా డిలీట్ చేసిందని వెలుగు చూసింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న ఐటీ అధికారులు ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
లలిత్ మోదీ పర్సనల్ సెక్రటరిగా దీపా పాలేకర్ పని చేశారు. ఆమె లలిత్ మోదీకి పర్సనల్ సెక్రటరిగానే కాకుండా ఆయన 9 కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్నారు. 2010 లో లతిత్ మోదీ లండన్ వెళ్లిన తరువాత ఐపీఎల్, వ్యాపారలావాదేవీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఈ మెయిల్స్ మొత్తం తొలగించారు.
దీపా సంవత్సరానికి రూ. 45.60 లక్షల జీతం తీసుకుంటున్నది. దీపాకు 8 ఈ మెయిల్ అకౌంట్లు ఉన్నాయి. వాటిలో కమ్యూనికేషన్ కోసం ఒక్క ఈ మెయిల్ అకౌంట్ పెట్టుకుని మిగిలిన అకౌంట్స్ డిలీట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని వెలుగు చూసిన తరువాత లలిత్ మోదీ లండన్ వెళ్లి పోయారు.
తరువాత ఆదాయపన్ను శాఖ (ఐటి) అధికారులు దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఐటి అధికారులు మోదీ పర్సనల్ సెక్రటరి దీపాను ప్రశ్నించారు. ఎందుకు ఈ మెయిల్ అకౌంట్లు తొలగించారని ప్రశ్నించారు. తమకు పని పూర్తి అయినందు వలన తొలగించామని దీపా చెప్పారు.
కొన్ని సాంకేతిక లోపాల కారణంగా కంప్యూటర్ లో డిలీట్ అయ్యాయని దీపా సమాధానం ఇచ్చారు. 2010 సంవత్సరానికి ముందు, ఐపీఎల్ వ్యవహారాలు, వాటి లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిల్స్ తన దగ్గర లేవని దీపా సమాధానం ఇచ్చారని ఐటీ అధికారులు అంటున్నారు.