కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ మనిషి: లలిత్ మోదీ
న్యూయార్క్: బీజేపీ నాయకులను టార్గెట్ చేసుకుంటున్న లలిత్ మోదీ మీద ఏ విధంగా స్పందించాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీద లలిత్ మోదీ నోరు పారేసుకున్నాడు.
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీద విమర్శలు గుప్పించారు. అరుణ్ జైట్లీ బీజేపీలో ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటు ట్విట్ చేశారు. అదే విధంగా పలువురు కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ట్విట్ చేశాడు.
ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) కుంభకోణంలో అరుణ్ జెట్లీ ప్రమేయం ఉందని నేరుగా ఆరోపించారు. అరుణ్ జెట్లీ తన ఫోన్ కాల్ డేటాను బయటపెడితే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని అన్నారు. వెంటనే కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ విషయంపై స్పందించడానికి అరుణ్ జైట్లీ నిరాకరించారు. వ్యాపారంలో భాగంగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టారని వివరించారు.
ఆర్థిక అక్రమ నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కోంటున్న లిలిత్ మోదీకి అక్రమంగా వీసా మంజూరు చేశారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఇప్పుడు లలిత్ మోదీ అరుణ్ జెట్లీని టార్గెట్ చేసుకున్నాడు.