మోడీ సంచలనం: గాలి కుమార్తె పెళ్లి ఏలా ?
బెంగళూరు: నల్లధనాన్ని అరికట్టే లక్షంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు పలువురు ప్రముఖుల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బపడుతోంది. ముఖ్యంగా శుభకార్యాలు పెట్టుకున్న వారు అయోమయంలో పడిపోయారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ. 500, రూ.1,000 నోట్లు చెల్లవని ప్రకటించిన తరువాత పెళ్లిళ్లు, శుభకార్యాలు చెయ్యడానికి ముందుగా నిల్వ చేసుకున్న ఆనోట్లతో ఇప్పుడు ఏమి చెయ్యాలి దేవుడా ? అంటు తలలు పట్టుకుంటున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం ఈనెల 16వ తేదీన బెంగళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఇప్పుడు రూ. 500, రూ.1,000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని, అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఏమి చేస్తారా ? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణ వివాహ శుభలేఖలు సరికొత్త టెక్నాలజీతో తయారు చేయించి భారతదేశంలోని ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. శుభలేఖలే ఇలా ఉంటే ఇక పెళ్లి ఎలా ఉంటుంది ? అంటూ ఎవరికితోచినట్లు వారు ఊహించుకుంటు వస్తున్నారు.
మొత్తం మీద గాలి తన కుమార్తె పెళ్లి ఎలా చేస్తారో చూడాలి అని అందరూ ఆసక్తిగా చూస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు అందరి చూపు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి మీద పడింది.
సెప్టెంబర్ 30వ తేదికి ఇన్ కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ స్కీమ్ ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా లెక్కలు చూపించడానికి ప్రయత్నించినా అది బ్లాక్ మని లెక్కకిందకు వస్తుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి తన అనుచరుల సహాయంతో తన కుమార్తె వివాహం ముందుగా అనుకున్నట్లు ఘనంగా చేస్తారని సమాచారం.
సన్నిహితుల దగ్గర రుణం కింద డబ్బు తీసుకుని దానిని తిరిగి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని గాలి అనుచరులు, ఆయన అభిమానులు, ఆయనంటే గిట్టని వారు కూడా ఇప్పుడు గాలి ఏమి చేస్తారా ? అని ఆసక్తిగా గమనిస్తున్నారు.