టైమ్ బ్యాడ్: రాసలీలల సీడీ మాజీమంత్రి రమేష్ జార్కిహోళికి కొత్త చిక్కు: తాలూకా ఆసుపత్రిలో
బెంగళూరు: రమేష్ జార్కిహోళి.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనానికి దారి తీసిన రాసలీల సీడీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదీ కలిసి రానట్టే కనిపిస్తోంది. ఓ యువతితో రాసలీలు సాగించిన వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత ఆయన తన పదవిని పోగొట్టుకున్నారు. ముఖ్యమంత్రి బీఎస యడియూరప్ప కేబినెట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన జలవనరుల మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
తాలూకా ఆసుపత్రిలో..
తాజాగా ఆయనకు కరోనా వైరస్ సోకింది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డ ఆయన బెళగావి జిల్లాలోని గోకక్ తాలూకా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. హోమ్ క్వారంటైన్లో వెళ్లిన ఆయన జార్కిహోళికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనితో ఆయనను హుటాహుటిన గోకక్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో ఉంచి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. సెక్స్ స్కాండల్ కేసు వ్యవహారంలో ఆయన శుక్రవారం నాడే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలతో తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ సందేశాన్ని పంపించారు.
జ్వరం.. దగ్గు..
తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన రెండు, మూడు రోజులుగా హోమ్ ఐసొలేషన్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఆ వెంటనే శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీనితో హుటాహుటిన గోకక్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు చక్కెర వ్యాధి కూడా ఉంది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయిదారు రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు.
మహారాష్ట్రకు వెళ్లొచ్చిన రమేష్..
రమేష్ జార్కిహోళి కిందటి నెల 30వ తేదీన మహారాష్ట్రకు వెళ్లొచ్చారు. కొల్హాపూర్లోని ప్రఖ్యాత మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి, స్వస్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తరువాతే రమేష్ జార్కిహోళికి కరోనా వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కొల్హాపూర్కు వెళ్లొచ్చిన తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారని బీజేపీ నాయకులు, ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా- సీడీ దర్యాప్తు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.