ధార్వాడ ఘటనలో మాజీమంత్రి మామ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ధార్వాడ ఘటనలో మాజీమంత్రి సమీప బంధువు అరెస్ట్ అయ్యారు. గురువారం ఉదయం ఆయనను అరెస్టు చేశారు. ధార్వాడలో నిర్మాణంలో అయిదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది భవన నిర్మాణ కార్మికులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో భవనం శిథిలాల మధ్య చిక్కుకున్న సుమారు 40 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. భవనం కుప్పకూలి పోయి ఘటన మూడోరోజు చేరుకున్నప్పటికీ.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

ధర్వాడలోని కుమరేశ్వర నగర ప్రాంతంలో ఉన్న కేవీజీ బ్యాంక్ సమీపంలో ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న అయిదు అంతస్తుల భవనం మూడురోజుల కిందట కుప్పకూలింది. షాపింగ్ కాంప్లెక్స్ గా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం నలుగురు యజమానుల్లో మంత్రి వినయ్ కులకర్ణి ఒకరిదని తేలింది. ఈ భవనం నిర్మాణంలో వినయ్ కులకర్ణి మామ గంగణ్ణ పెట్టుబడులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీనితో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ స్థలం యాజమాన్య హక్కు పత్రాల్లో గంగణ్ణ పేరు ఉన్నట్లు స్పష్టమైంది. ఆయనతో పాటు రవి శబరథ, బసవరాజ్ నిగది, మహాబలేశ్వర కురబగుడ్డి, రాజు, సుహాన్ లతో పాటు కాంట్రాక్టర్ వివేక్ పవార్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయిదంతస్తుల ఈ భవనం నిర్మాణ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. తొలి రెండు అంతస్తుల్లో నిర్మాణాలు పూర్తి కావడంతో.. వాటిని వివిధ వ్యాపార కార్యకలాపాల కోసం అద్దెకు ఇచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన మూడంతస్తుల్లో నిర్మాణ పనులు నడుస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications