బీజేపీ గూటికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే: ఇంత కాలం కాంగ్రెస్ కు జై: అసెంబ్లీ ఎన్నికల్లో!
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పని చేసి గత శాసన సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన గూళిహట్టి శేఖర్ బీజేపీలో చేరడానికి సిద్దం అయ్యారు. శనివారం సాయంత్రం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
బెంగళూరులోని మల్లేశ్వరంలోని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ సమక్షంలో మాజీ మంత్రి గూళిహట్టి శేఖర్ అధికారికంగా బీజేపీలో చేరుతున్నారు.
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన గూళిహట్టి శేఖర్ తరువాత ఆయన ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అనేక మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని హైదారబాద్ వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు యడ్యూరప్ప ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు.
అనంతరం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో యడ్యూరప్ప ప్రభుత్వం గట్టెక్కడంతో అన్యాయం జరిగింది అంటూ అసెంబ్లీలోనే షర్టు చింపుకున్న గూళిహట్టి శేఖర్ నానా హంగామా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న గూళిహట్టి శేఖర్ ఒక్కసారిగా బీజేపీలోకి జంప్ అవుతున్నారు.