బొగ్గు కుంభకోణం: సుప్రీం కోర్టును ఆశ్రయించిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం(కోల్గేట్) కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సమన్లు రద్దు చేయాలని కోరారు.
యుపిఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ.. గత జనవరిలో మన్మోహన్ను ప్రశ్నించింది.
ఈ కేసు విచారణకై ఏర్పాటైన ప్రత్యేక కోర్టు.. సిబిఐ దాఖలు చేసిన తుది ఛార్జీషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ చిత్తుశుద్ధి గల వ్యక్తి అని చెప్పారు. తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. మన్మోహన్ సింగ్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని తెలిపారు.