జయలలితకు షాక్ : కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వొచ్చని సుప్రీం స్పష్టీకరణ
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టులోని ప్రతేక బెంచ్ తీర్పు ఇవ్వవచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జయలలిత తదితరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును కర్ణాటక హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సి.ఆర్. కుమారస్వామి ఇదే సంవత్సరం మార్చి 11వ తేదిన విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వులో పెట్టారు.
కేసు దర్యాప్తు కర్ణాటక హైకోర్టు అడ్వకేట్ జనరల్ స్పందించడం లేదని, ఈ తీర్పు వెల్లడించే విషయంపై డిఎంకే నేత అన్బళగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ అర్జీ విచారణ చేసింది. ఇప్పటికే జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ పూర్తి అయ్యిందని, మళ్లీ విచారణ చెయ్యనవసరం లేదని స్పష్టం చేసింది.
అన్బళగన్ రాతపూర్వకంగా కర్ణాటక హైకోర్టులో అర్జీ సమర్పించుకొవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27వ తేదిన సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు జైలు శిక్ష విధించింది.
ఇదే కేసులో జయలలితకు రూ. 100 కోట్లు జరిమానా విధించారు. తరువాత వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకున్నారు. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తు ప్రత్యేక బెంచ్ తో విచారణ చేయించాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. సుప్రీం కోర్టు కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది.