బీజేపీలో ఒకేరోజు భారీ విషాదాలు -కరోనాతో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మృతి -ఎంపీ శర్మ ఆత్మహత్య
భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకే రోజు రెండు భారీ విషాదాలు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించిన కాసేపటికే, బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ గాంధీ కన్నుశారు. వరుస విషాదాల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే..
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దిలీప్ గాంధీ (70) కరోనాతో బాధ పడుతూ బుధవారం కన్నుమూశారు. మంగళవారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలోచేరగా, కొద్ది గంటలకే పరిస్థితి విషమించడంతో తుది శ్వాస తీసుకున్నారు. దిలీప్గాంధీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని అహ్మద్నగర్ దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన దిలీప్ గాంధీ.. వాజ్పేయి ప్రభుత్వంలో షిప్పింగ్ శాక సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత 1999లో ఆ తరువాత 2009, 2014లో లోక్ సభకు ఎన్నికైనా, 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. దిలీప్ గాంధీకి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఢిల్లీలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా,
హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న సిట్టింగ్ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. గదిలోని సీలింగ్ కు ఉరి వేసుకుని విగత జీవిగా ఎంపీ కనిపించారని, బహుశా ఇది ఆత్మహత్యే అయి ఉండొచ్చని పోలీసులు చెప్పారు. ఎంపీ మృతి నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం వాయిదా పడింది. కాగా, శర్మ మృతిపై మాత్రం ప్రధాని మోదీ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications