Coronavirus: కరోనాను జయించిన ఎంపీ కూతురు, భయపడితే ఫినిష్: విదేశాలు, సినిమాలు!
బెంగళూరు/ దావణగెరె: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రపంచం హడలిపోతుంది. కరోనా వైరస్ వ్యాధితో ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. కరోనా పేరు చెబితే నేడు ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. అయితే కరోనా వైరస్ కు భయపడకూడదని, మీరు మనోధైర్యంతో ఉంటే ఆ వ్యాధిని ఎదుర్కోవచ్చని కర్ణాటక ఎంపీ కుమార్తె అంటున్నారు.
తాను విదేశాల నుంచి వచ్చి 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో వైద్యుల ఇచ్చిన మందులు ఉపయోగించానని, ధైర్యంగా తాను పోరాటం చేసి కరోనాను ఎదుర్కొన్నానని, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని కర్ణాటకలోని దావణగెరె ఎంపీ కుమార్తె అంటున్నారు. తాను కరోనా క్వారంటైన్ వార్డులో 14 రోజులు ఎలా గడిపాను అనే పూర్తి వివరాలను ఎంపీ కుమార్తె అశ్విని వివరించారు.
Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!
గయానాలో ఎన్నికల దెబ్బకు!
కర్ణాటకలోని దావణగెరె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జి.ఎం. సిద్దేశ్వర కుమార్తె అశ్విని సౌత్ ఆఫ్రికాలోని గయానాలో ఉన్నారు. గయానాలో ఎన్నికల హడావిడి ఎక్కువ కావడంతో ఎంపీ జి.ఎం. సిద్దేశ్వర కుమార్తె అశ్విని కుటుంబ సభ్యులు మార్చి 20వ తేదీ భారత్ వచ్చేశారు. అశ్విని భారత్ వచ్చే సమయానికే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాపించింది.
రెండు రోజులు కరోనా పరీక్షలు
భారత్ వచ్చిన అశ్విని, ఆమె పిల్లలకు వైద్యులు రెండు రోజులు వైద్య పరీక్షలు నిర్వహించారని అశ్విని అన్నారు. తరువాత తనకు పాజిటివ్, తన పిల్లలకు నెగటివ్ వచ్చిందని అశ్విని చెప్పారు. ప్రభుత్వ నియమాల ప్రకారం తనను అంబులెన్స్ లో ఎస్ఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో పెట్టారని ఎంపీ కుమార్తె అశ్విని అన్నారు.
వార్డులో ఒక్కటే ఉన్నాను
తాను ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో 14 రోజుల పాటు ఒక్కటే ఉన్నానని అశ్విని చెప్పారు. ఆ సమయంలో ఒంటరి తనంతో తాను కొంచెం విసిగిపోయానని అశ్విని అన్నారు. కరోనా ఐసోలేషన్ వార్డులో ఒంటరిగా ఉన్న తనకు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని, ఆ సమయంలో తనకు ఎంతో ధైర్యం వచ్చిందని ఎంపీ కుమార్తె అశ్విని వివరించారు.
మందులు, మొబైల్ లో సినిమాలు
కరోనా ఐసోలేషన్ వార్డులో ఉన్న తానకు ప్రతిరోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఫోన్ చేసి మాట్లాడేవారని, ఆ సమయంలో తనకు ఎంతో ధైర్యం వచ్చిందని అశ్విని చెప్పారు అంతే కాకుండా క్రమం తప్పకుండా వైద్యులు ఇచ్చిన మందులు వేసుకున్నానని, ప్రతిరోజు మొబైల్ లో సినిమాలు చూసి ఈ 14 రోజులు ఐసోలేషన్ లో కాలం గడిపానని అశ్విని వివరించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేశానని, మనసులో అలజడి తగ్గిచుకోవడానికి దేవుడిని ప్రార్థించానని కరోనా ఐసోలేషన్ లో గడిపి 14 రోజుల గురించి అశ్విని వివరించారు.
ప్రధాని, సీఎం, వైద్యులు
ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెబుతున్న మాటలతో తనకు ఎంతో ధైర్యం వచ్చిందని, అందుకే కరోనా వైరస్ పై పోరాటం చేసి ఆరోగ్యంగా నేను ఈ రోజు బయటకు వచ్చానని ఎంపీ కుమార్తె అశ్విని వివరించారు. సీఎం యడియూరప్ప సూచనలతో బెంగళూరులోని నిమ్హాన్స్ వైద్యులు తనకు ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారని అశ్విని గుర్తు చేశారు.
కరోనాకు ఎందుకు భయపడాలి?
ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ యోగా చెయ్యాలని, వైద్యులు, ప్రభుత్వం సూచనలు పాటించాలని, అప్పుడు కరోనా వైరస్ ను మనం ఎదుర్కోవచ్చని అశ్విని వివరించారు. కరోనా వైరస్ పెద్ద వ్యాధి కాదని, కరోనాకు మనం భయపడనవసరం లేదని, మనం ధైర్యంగా ఉంటే ఆ వ్యాధిని దగ్గరకు రాకుండా చేసుకోవచ్చని, అందుకే మనం రోడ్ల మీద తిరగకుండా ఇంటిలోనే క్వారంటైన్ లో ఉండాలని ఎంపీ కుమార్తె ప్రజలకు మనవి చేశారు.