సెక్స్ మార్పిడి ఆపరేషన్లకు అడ్డాగా భారత్..
లింగ మార్పిడి ఆపరేషన్లకు భారత్ ఓ భవిష్యత్ అడ్డాగా మారబోతుంది. ప్రపంచ దేశాలతో పోల్చితే చౌక ధరలకే లింగ మార్పిడి చేసుకునే అవకాశం భారత్ లో ఉండడంతో ఆపరేషన్ కోసం వివిధ దేశాల నుంచి, భారత్ లో వాలిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ మాజీ సైనికుడు భారత్ లో లింగమార్పిడి చేయించుకుని పూర్తి స్థాయి స్త్రీ గా మారిపోవడంతో ఇప్పుడు భారత్ లో లింగ మార్పిడి అంశం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
శరీరం వేరు.. మానసికంగా మనసులో ముద్రించుకుపోయిన తత్వం వేరు. శారీరక స్థితికి, మానసిక ప్రవర్తనకు మధ్య డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొనేవాళ్లు చాలామందే ఉంటారు. ఈ స్థితి నుంచి బయటపడి, పూర్తి స్థాయి స్త్రీ గా మారడానికి ప్రయత్నించేవాళ్లు ఎంతోమంది. ఇలాంటి నేపథ్యాన్నే కలిగిన అమెరికా మాజీ సైనికుడు బెట్టీ ఇండియాకు వచ్చి విజయవంతంగా లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.
ముందుగా లింగమార్పిడిపై ఇతర దేశాల్లో అయ్యే ఖర్చులన్నింటిపైనా ఆరా తీసిన బెట్టీ.. ఒక్క ఇండియాలో మాత్రమే లింగమార్పిడికి చౌక ధరలో ఆపరేషన్ చేయించుకోవచ్చనే నిర్దారణకు వచ్చాడు. ఇదే ఆపరేషన్ పై థాయిలాండ్ లోను ఆరా తీయగా, అక్కడయ్యే ఖర్చుల్లో ఐదో వంతు ఖర్చుతో ఇండియాలో ఆపరేషన్ చేస్తారని తెలుసుకున్నాడు. దీంతో ఇండియాలో అడుగుపెట్టిన బెట్టీ, ఉత్తర ఢిల్లీలోని ఓల్మెక్ క్లినిక్ సెంటర్ లో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్, విమాన ఛార్జీలు, షాపింగ్ ఖర్చులన్నీ కలుపుకుని మొత్తం 22వేల డాలర్లతో తన ఆపరేషన్ పూర్తయిందని ఆమెగా మారిన బెట్టీ తెలిపింది.
కాగా.. ఓల్మెక్ క్లినిక్ సెంటర్ లో ఏడాదికి 20 లింగమార్పిడి ఆపరేషన్లు చేస్తున్నామని, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి తమ క్లినిక్ కు చాలామంది వస్తున్నారని పేర్కొన్నారు క్లినిక్ వ్యవస్థాపకులు, ప్లాస్టిక్ సర్జన్ నరేంద్ర కౌషిక్. అమెరికా టూరిజాన్ని ఇండియా ప్రోత్సహించడం కూడా విదేశాల నుంచి ఆపరేషన్స్ కోసం వచ్చేవారి సంఖ్య పెరగడానికి ఒక కారణమని చెప్పారు.