మోడీ మార్క్: జివోఎంలు రద్దు, వేగవంత నిర్ణయాలకోసం
న్యూఢిల్లీ: పాలనలో నరేంద్ర మోడీ మార్క్! యూపిఏ ప్రభుత్వ వారసత్వానికి స్వస్తి పలుకుతూ మోడీ శనివారం దాదాపు 30 వరకూ మంత్రుల బృందాలు (జిఓఎం), సాధికారిక మంత్రుల బృందాలను (ఈజివోఎం) రద్దు చేసి పెండింగ్లో ఉన్న అంశాలపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
తొమ్మిది సాధికారిక మంత్రుల బృందాలు, 21 మంత్రుల బృందాలను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని కార్యాలయం (పిఎంఓ) నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడం, అలాగే వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడం కోసం వీటిని రద్దు చేసినట్టు ప్రకటించింది. ఈజిఎంలు, జిఓఎంల వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను ఇప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలే పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాయని ప్రకటన తెలిపింది.

ఎక్కడైనా మంత్రిత్వ శాఖలకు ఇబ్బందులు ఎదురైన పక్షంలో కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాని కార్యాలయం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తోడ్పాటు అందిస్తాయని కూడా పేర్కొంది. ఇజిఓఎంలు, జిఓఎంలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన పిఎంఓ, మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అధికారాలను అప్పగించడానికి తీసుకున్న ప్రధాన చర్యగా దీన్ని అభివర్ణించడం గమనార్హం.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఇజిఓఎంలలో చాలా వాటికి నేతృత్వం వహించారు. అవినీతి, అంతర్రాష్ట నదీ జలాల వివాదాలు, పరిపాలనా సంస్కరణలు, గ్యాస్, టెలికాం ధరలు నిర్ణయించడం లాంటి వాటికోసం కమిటీలను ఏర్పాటు చేసారు.
కేంద్రమంత్రివర్గం లాగానే ఇజిఓఎంలు నిర్ణయాలు తీసుకునేవి. అయితే జిఓఎంలు చేసిన సిఫార్సులను మాత్రం తుది ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచేవారు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటుగా సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల అధికారాల పునరుద్ధరణకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
నిర్ణయాలు తీసుకునే స్థాయిలను తగ్గించడంతో పాటుగా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ఆ వర్గాలు తెలిపాయి. మంత్రిత్వ శాఖల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే పరిష్కరించడానికి ప్రధాని కార్యాలయం, కేబినెట్ కార్యదర్శి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
పదేళ్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉన్న జిఓఎంల గురించి అడగ్గా, ఈ జిఓఎంలలో చాలా కమిటీలు కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాలేదని, కొన్ని మాత్రమే నిర్ణయాలు తీసుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
జిఓఎంల వ్యవస్థలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే నిర్ణయానికి రావడం కోసం వాటికి ఎలాంటి గడువు నిర్ణయించకపోవడం, ఫలితంగా జవాబుదారీతనం లేకుండానే అవి ఏళ్ల తరబడి నిర్ణయాలను జాప్యం చేయడం జరుగుతూ ఉండేది. కాగా, జివోఎం, ఈజీవోఎంలను యూపిఏ సమర్థించుకుంది. ఆయా అంశాలలోని సంక్లిష్టతల వల్ల వాటిని ఏర్పాడు చేశాని చెప్పారు. ప్రస్తుతం పలు అంశాలు సంక్లిష్టంగా ఉన్నాయని, వాటికి ఇలాంటివి అవసరమని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications