సీఎం నితీశ్పై చెప్పులతో దాడి - ఎన్నికల సభలో అనూహ్య ఘటన - నలుగురు అరెస్ట్
హోరాహోరీగా జరుగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పైనే చెప్పుల దాడి చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ జిల్లాలోని సక్రా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన ఆయనపై.. స్థానిక యువకులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.
ప్రసంగం తర్వాత సభా వేదిక నుంచి హెలిప్యాడ్ కు వెళుతోన్న సమయంలో నితీశ్ ను టార్గెట్ చేసుకుని.. నలుగురు యువకులు చెప్పులు విసిరారు. అదృష్టవశాత్తూ అవి సీఎంకు తగలనప్పటికీ, ఈ ఘటనతో ఆయన షాక్ తిన్నారు. క్షణాల్లో స్పందించిన పోలీసులు.. సదరు యువకులను పట్టుకుని స్టేషన్ కు తరలించారు.

ఇటీవల నితీశ్ సభలకు జనం పలుచగా వస్తుంటం, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వ్యతిరేక నినాదాలు వినిపిస్తుండటం పరిపాటిగా మారింది. దీంతో అసహనానికి గురైన ఆయన.. ''ఓటు వేస్తే వేయండి.. లేకపోతే పొండి..'' అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ క్రమంలో సోమవారం నాటి చెప్పుల దాడి ఘటన ఎటువైపునకు దారి తీస్తుందో చూడాలి. ఈమధ్యే..

మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు కూడా ఇటీవల ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఔరంగాబాద్ జిల్లాలోపి కుతుంబా అసెంబ్లీ స్థానంలో ప్రచారం కోసం వెళ్లిన ఆయనపై స్థానిక యువకులు చెప్పులు విసిరగా, అందులో ఒకటి ఆయనపై పడింది. కాసేపటి తర్వాత ప్రసంగంలో ఆ విషయాన్ని తేజస్వీ ప్రస్తావించలేదు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈనెల 28న తొలి దశ, నవంబర్ 3న రెండో, నవంబర్ 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.













Click it and Unblock the Notifications