భారత్ లో ఓమిక్రాన్ నాలుగో కేసు-దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్ర వచ్చిన వ్యక్తికి వైరస్
భారత్ లో ఓమిక్రాన్ వైరస్ కలకలం పెరుగుతోంది. ఇప్పటికే భారత్ లోని కర్నాటకలో రెండు కేసులు, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఓ కేసు నమోదుకాగా.. తాజాగా మహారాష్ట్రలో నాలుగో కేసు బయటపడింది. దీంతో భారత్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమవుతున్నాయి.
Recommended Video
భారత్ లో ఓమిక్రాన్ వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ముందుగా కర్నాటకలోని బెంగళూరులో ఓ దక్షిణాఫ్రికా జాతీయుడితో పాటు మరో స్ధానిక డాక్టర్ కు సైతం ఓమిక్రాన్ నిర్దారణ అయింది. వీరిలో దక్షిణాఫ్రికా జాతీయుడు ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా దుబాయ్ వెళ్లిపోయాడు. బెంగళూరు డాక్టర్ కు మాత్రం చికిత్స కొనసాగుతోంది. ఇవాళ గుజరాత్ లోని జామ్ నగర్ కు వచ్చిన ఓ జింబాబ్వే జాతీయుడికి ఓమిక్రాన్ వైరస్ నిర్దారణ అయింది. దీంతో కేసుల సంఖ్య మూడుకు చేరింది. దీనిపై చర్చ సాగుతుండగానే మహారాష్ట్రలో మరో కేసు వచ్చింది.
దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చిన ఓ మహారాష్ట్ర వాసికి తాజాగా చేసిన శాంపిల్స్ పరీక్షల్లో ఓమిక్రాన్ వైరస్ నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. అతని వయస్సు 33 ఏళ్లుగా నిర్దారించారు. ఇతను తాజాగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతన్ని ప్రస్తుతం క్వారంటైన్ లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వతహాగా మహారాష్ట్ర వాసి అయిన ఇతను దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతనికి పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అతని కాంటాక్టుల్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మరోవైపు భారత్ లో ఓమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో వారి కాంటాక్ట్ లను గుర్తించడం కష్టంగా మారుతోంది. వీరిలో పలువురు ఇప్పటికే అజ్ఠాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మిగతా వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. కనిపించని వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక్క కర్నాటకలోనే ఓమిక్రాన్ సోకిన రోగితో కాంటాక్ట్ అయిన 10 మంది మిస్సయ్యారు.