మూడో పెళ్లికి సిద్దం అయ్యాడు: నడి రోడ్డులో బెండ్ తీశారు
బెంగళూరు: ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నా మూడో పెళ్లికి సిద్దం అయ్యాడు. విషయం తెలుసుకున్న రెండో భార్య బంధువులు అతనిని నడి రోడ్డు మీదకు ఈడ్చుకువచ్చి దేహశుద్ది చేశారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తుమకూరు జిల్లా మధుగిరి తాలుకాలోని సంకపురంలో మహమ్మద్ పీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. డబ్బు కోసం ఆశపడి మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.
తుమకూరు పట్టణంలోని శాంతినగరలో నివాసం ఉంటున్న తబుసుమ్ బానును వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. మహమ్మద్ పీర్, తబుసుమ్ బాను ల నిశ్చితార్థం ఇప్పటికే జరిగింది.
తబుసుమ్ బాను కుటుంబ సభ్యులు మహమ్మద్ పీర్ కు రూ. 60 వేలు, ఇంటికి కావాలసిన వస్తువులు ఇచ్చారు. మంగళవారం తుమకూరులోని మదర్ షాదీ మహల్ లో వివాహం జరగవలసి ఉంది.
ఈ విషయం రెండో భార్యకు తెలిసింది. ఆమె తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. తుమకూరు చేరుకున్న రెండో భార్య బంధువులు పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్న మహమ్మద్ పీర్ ను పట్టుకుని బట్టలు ఊడదీసి చితకబాదేశారు.
నడిరోడ్డులో కొట్టుకుంటూ తీసుకు వెళ్లి జయనగర పోలీసులకు అప్పగించారు. మహమ్మద్ పీర్ రెండో భార్య, ఆమె బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పెళ్లి జరగక ముందే విషయం తెలియడంతో తబుసుమ్ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. తబసుమ్ కుటుంబ సభ్యులు మహమ్మద్ పీర్ మీద కేసు పెట్టారు.