100మంది యువతులను ట్రాప్ చేసి: బెంగళూరులో ఘరానా మోసగాడి నిర్వాకం..
జైలు నుంచి వచ్చాక కూడా సాదత్ తీరు మారలేదని, వచ్చీ రాగానే బాగలూరుకు చెందిన ఓ యువతిని బుట్టలో వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
బనశంకరి: ఫేస్ బుక్, వాట్సాప్, మ్యాట్రిమోనియల్.. ఒక్కో దాంట్లో ఒక్కో పేరుతో నకిలీ ఐడీ. చదివింది ఐటీఐ.. కానీ అమ్మాయిలను మోసం చేయడంలో పీహెచ్డీ చేశాడనే చెప్పాలి. హైఫై ప్రొఫైల్ తో అమ్మాయిలకు గాలం వేసి.. ఒక యువతి వద్ద దోచుకున్న సొమ్ముతో మరో యువతి వద్ద జల్సాలు చేసేవాడు. కార్లు, స్టార్ హోటల్స్ లో విందులతో అమ్మాయిలు కూడా అతన్ని ఇట్టే నమ్మేసేవారు.
కానీ మోసాలు ఎక్కువ రోజులు దాగవు కదా!.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మంది అమ్మాయిలను మోసం చేసిన ఈ ఘనుడి వ్యవహారం ఇటీవలే బట్టబయలైంది. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. కూపీ లాగిన పోలీసులు.. హాసన్ నగర్ కు చెందిన సాదత్ ఖాన్ అలియాస్ ప్రీతమ్ కుమారే ఈ నయవంచకుడని తేల్చారు. అతగాడి మోసాల జాబితా చూసి పోలీసులే కంగు తిన్నారు.
ఎవరీ సాదత్ ఖాన్:
హాసన్ నగరంలో ఉండే సాదత్ ఖాన్ ఐటీఐ వరకు చదువుకున్నాడు. ఆపై ఆటోడ్రైవర్ గా మారి.. మద్యానికి బానిసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని ఇంటినుంచి వెళ్లగొట్టారు. 2011లో బెంగుళూరుకు చేరుకుని యశ్వంతపురలోని ఒక వెల్డింగ్ షాపులో పనికి కుదిరాడు. కొంతకాలానికి అక్కడ పని మానేసి.. కోరమంగళలో ఉన్న కంట్రీ క్లబ్ లో టెలీకాలర్ గా ఉద్యోగం సంపాదించాడు.
ఆ తర్వాత కెంపాపుర సొస్కో, ఎంజీ రోడ్డులోని హాలెక్స్ కంపెనీల్లోను టెలీకాలర్ గా చేరినా.. అమ్మాయిలను వేధిస్తున్నాడన్న కారణంగా ఆ కంపెనీలు ఇతన్ని తొలగించాయి.
ఈజీ మనీ కోసం:
ఏ కంపెనీకి వెళ్లినా తిప్పి పంపిస్తుండటంతో.. ఈజీ మనీ కోసం సాదత్ ప్రయత్నించాడు. ఇందుకోసం పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసుకున్నాడు. ఫేస్ బుక్, మ్యాట్రిమోనియల్, వెబ్ సైట్లలో నకిలీ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు. మహమ్మద్ ఖాన్, కార్తీక్, ప్రీతమ్ కుమార్, ఇలా రకరకాల పేర్లతో నకిలీ ఐడీలు మెయింటెయిన్ చేశాడు.
ఒక ఐడీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, మరో ఐడీలో ప్రభుత్వ ఉద్యోగిగా, ఇంకో చోట ప్రైవేట్ కంపెనీ సీఈవోగా నకిలీ ప్రొఫైల్స్ సృష్టించుకున్నాడు. హైఫై వ్యక్తి అని భ్రమపడ్డ చాలామంది యువతులు ఇతని వలలో చిక్కుకున్నారు. ఒకసారి అతనికి దగ్గరయ్యాక.. భారీ మొత్తంలో డబ్బు గుంజి.. ఆ తర్వాత వదిలించుకునేవాడు.
వందమంది యువతులను మోసగించి:
అంతూ పొంతూ లేని మోసాలతో సుమారు 100మంది యువతులను సాదత్ మోసం చేశాడు. ఒకరి వద్ద డబ్బులు గుంజడం.. మరో యువతితో ఎంజాయ్ చేయడం ఇతనికి నిత్యకృత్యంగా మారిపోయింది. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి.. అందినకాడికి దోచుకుని.. ఆపై ఆచూకీ లేకుండా పోయేవాడు. స్టార్ హోటల్స్, లగ్జరీ కార్లతో యువతులను ఇట్టే నమ్మించి.. ముగ్గులోకి దింపేవాడు. ఇలా గత ఆరేళ్ల కాలంలో 100మంది అమ్మాయిలను సాదత్ మోసం చేశాడు.
కర్ణాటక మొత్తం కేసులే:
పరువు పోతుందనే ఉద్దేశంతో చాలామంది యువతులు ఇతనిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు కొంతమంది యువతులు సాదత్ అలియాస్ ప్రీతమ్ వ్యవహారాలపై పోలీసులను ఆశ్రయించడంతో.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కర్ణాటకవ్యాప్తంగా ఇతనిపై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన బాగలూరు పోలీసులు.. హాసన్ లో అతన్ని పట్టుకున్నారు.
కేఆర్ పుర, విద్యారణ్యపుర, జయనగర, హెబ్బగోడి, దొడ్డబళ్లాపుర, మైసైూరు, ధారవాడ, యలహంక పోలీస్ స్టేషన్లలోను ఇతని మీద కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలో మైసూరులోని కేఆర్ పుర పోలీస్ స్టేషన్ లో ఓ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.
జైలు నుంచి రాగానే మళ్లీ:
జైలు నుంచి వచ్చాక కూడా సాదత్ తీరు మారలేదని, వచ్చీ రాగానే బాగలూరుకు చెందిన ఓ యువతిని బుట్టలో వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తుమకూరు, మైసూరు, దొడ్డబళ్లాపుర, హుబ్లీ, ధార్వాడ, బెంగళూరుల్లోని అమ్మాయిలను మోసగించి రూ.45లక్షలను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. యలహంకలో నమోదైన కేసు ప్రకారం.. ఒక మహిళను శారీరకంగాను అతను వాడుకున్నాడని నిర్దారించారు.