Bihar Elections 2020: బీహారీలకు ఉచిత కరోనా వ్యాక్సిన్.. బీజేపీ మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
బీహార్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు వారి మేనిఫెస్టోలు విడుదల చేయగా... తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనావైరస్ ప్రస్తావన ప్రధానంగా కనిపించింది. ఇందులో ప్రతి ఒక్కరికీ కరోనావైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొంది.
Recommended Video

అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
బీహార్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మేనిఫెస్టోలతో పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేదానిపై స్పష్టతనిచ్చాయి. తాజాగా బీజేపీ మేనిఫెస్టోను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. కరోనావైరస్ వ్యాక్సిన్ రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ ఉచితంగా అందజేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 19 లక్షల కొత్త ఉద్యోగాలను రానున్న ఐదేళ్లలో కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
భారీగా ఉద్యోగాల భర్తీ
ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న ఆత్మనిర్భర్ భారత్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని మేనిఫెస్టోలో ప్రధానాంశంగా కనిపిస్తోంది. ఇక బీఈడీ చేసి ఉద్యోగం లేక టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి కూడా బీజేపీ గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా 3 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు హామీ ఇచ్చింది. పేదల కోసం 30 లక్షల పక్కా ఇళ్లను 2022 నాటికి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో ఆరోగ్య రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ శాఖలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది.

దర్భాంగాలో ఎయిమ్స్
కరోనావైరస్ నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇది పూర్తికాగానే బీహార్లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనావైరస్ వ్యాక్సిన్ విషయం పక్కనపెడితే దర్భాంగాలో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను తీసుకొస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక ఎన్డీయే ప్రభుత్వంలో బీహార్లో జీడీపీ క్రమంగా పెరుగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. 3శాతం నుంచి 11.3శాతంకు జీడీపీ పెరిగిందని చెప్పారు. జంగల్ రాజ్ ప్రభుత్వంలో కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న 15 ఏళ్లలో జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేవలం ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన ఇచ్చింది కనుకే సాధ్యమైందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు.
చివరిగా బీహార్ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేసి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సీతారామన్... రానున్న ఐదేళ్లకు కూడా నితీష్ కుమార్ సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. నితీష్ హయాంలోనే బీహార్లో అభివృద్ధివైపు దూసుకెళ్లుతుందన్న విశ్వాసాన్ని నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications