ఢిల్లీలో ఉచిత ఆర్టీసీ ప్రయాణం: కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం..
ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా రోడ్డు మీద వాహనాల సంఖ్యను, తద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్యం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం, దానికి తోడు పొగమంచుతో జనజీవనం అవస్థలు పడుతున్నారు.
కాలుష్య నియంత్రణపై ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్తులో ఢిల్లీ నివాసరహితంగా మారే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. రోడ్లపై వాహనాలను నియంత్రించడానికి ఐదు రోజుల పాటు సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతున్న ఢిల్లీ సర్కార్.. ఆ సమయంలో ఆర్టీసీ ప్రయాణాన్ని కూడా ఉచితం చేయనుంది.

ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా రోడ్డు మీద వాహనాల సంఖ్యను, తద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు అనగా నవంబర్ 17 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపారు.
ఉచిత ప్రయాణం ఆఫర్ తో ఆర్టీసీ రద్దీ పెరిగే అవకాశాలు ఉండటంతో.. మరో 600బస్సులను అదనంగా నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ సరి-బేసి విధానాన్ని అమలు చేయడం ఇది మూడోసారి.
అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయి కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే,కేజ్రీవాల్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని ఎన్జీటీ గుర్తుచేసింది. సరి-బేసి విధానాన్ని పిక్నిక్లా వాడుకుంటున్నారని ఎద్దేవా చేసింది.
సరి-బేసి విధానం అమలు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నివారణ మండళ్లు నివేదిక ఇచ్చాయని.. అయినా ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications