"ఆగ్రాలో మద్య నిషేధం విధించకపోతే ఆత్మహత్య చేసుకుంటా"
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం తాజ్ సిటి ఆగ్రాలో మద్య నిషేధం విధించాలని ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర సమరయోధుడు చిమన్ లాల్ జైన్ (96) డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ను చూడటానికి ప్రపంచ దేశాల నుండి అనేక మంది పర్యాటకులు వస్తుంటారని గుర్తు దేశారు. అదే విధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వారు ఆగ్రా వస్తుంటారని చెప్పారు. అలాంటి ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలో మద్యం విక్రయించరాదని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో మద్య నిషేధం విదించకుంటే అక్టోబర్ 2వ తేది గాంధీ జయంతి రోజు తాను యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మంగళవారం హెచ్చరించారు. ఆ రోజు తనను ఆత్మహత్య చేసుకోకుండా ఎవ్వరు అడ్డుకోలేరని అన్నారు.
సుమారు 600 మంది మహిళలు, పురుషులతో కలిసి ఖతీక్ పారా బస్తీలో మద్యపాన వ్యతిరేక శిబిరాన్ని నిర్వహిస్తామని చిమన్ లాల్ జైన్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకాశవాణిలో మద్యపానానికి వ్యతిరేకంగా చిమన్ లాల్ రూపొందించిన ఒక కార్యక్రమం ప్రసారం కానుందని సామాజిక వేత్త రాజీవ్ సక్సేనా తెలిపారు.