మోడీకి భయపడి పారిపోయిన దావూద్, ముంబైలోను..
న్యూఢిల్లీ/ముంబై: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానుండటంతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని మార్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకుంటున్న దావూద్.. ప్రస్తుతం పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో తాలిబన్ల ఆధీనంలోని గుర్తు తెలియని స్థావరానికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
మోడీ దేశ కొత్త ప్రధాని కావడానికి రంగం సిద్ధం కావడంతో చాలాకాలంగా పాక్లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని అఫ్గానిస్థాన్-పాక్ సరిహద్దుల్లోకి మార్చుకున్నట్లు మంగళవారం ఒక మీడియా కథనం పేర్కొంది. లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక గుజరాతీ టీవీ న్యూస్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తాము అదికారంలోకి వస్తే దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి అతని స్థావరంపై ఆకస్మిక దాడి జరుపుతామని సూచనప్రాయంగా చెప్పారు.
ఇప్పుడు మోడీ అధికారంలోకి వస్తుండడంతో 1993 ముంబయి ఉగ్రవాద పేలుళ్ల వెనుక ప్రధాన పాత్రధారి అయిన దావూద్ ఇబ్రహీంను ఆయన వేటాడడం ఖాయమని ఇంటెలిజన్స్ విభాగం సైతం భావిస్తోంది. మోడీ ఉద్దేశాలను చూసి దావూద్ ఇబ్రహీం భయపడిపోతున్నాడని, అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడం కోసం అబోటాబాద్పై అమెరికా జరిపిన దాడి తరహాలో తనపై కమాండో దాడి జరగవచ్చని భావిస్తున్నాడని ఆ కథనం పేర్కొంది.
ఈ భయాల కారణంగానే దావూద్ తన స్థావరాన్ని మార్చుకోవడమే కాకుండా తన భద్రతను మరింత పెంచమని పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐని కోరాడని కథనం వెల్లడించింది. ఒక్క దావూద్ ఇబ్రహీమే కాదు, దేశంలో అండర్ వరల్డ్ కేంద్రంగా పేరుబడ్డ ముంబై నుంచి ఆయన మనుషులు సైతం పారిపోయినట్లు తెలుస్తోంది. ఇంటెలిజన్స్ బ్యూరో (ఐబి) మాజీ డైరెక్టర్ అజిత్ దోవల్ సోమవారం కాబోకే కొత్త ప్రధాని మోడీని కలిసి దేశం భద్రతాపరంగా ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయనకు వివరించారు.
దేశం లోపల, వెలుపల ఉన్న ముప్పుల గురించి మోదీకి వివరించిన దోవల్ సాయాన్ని మోడీ ఇందుకోసం తీసుకోచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో కలిసి కుట్ర పన్నిన 1993 నాటి ముంబై వరస పేలుళ్ల కేసులో తొలి ముందడుగుకు కారణమైన మాజీ ఐపిఎస్ అధికారి వైసి పవార్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ నిజానికి దావూద్ను భారత్ తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు.
మోడీ తిరుగులేని ఆత్మవిశ్వాసం కలిగిన, ఏది ఏమయినా తాను అనుకున్నది సాధించాలనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, దావూద్ను పాకిస్తాన్ నుంచి ఖాళీ చేయించడానికి పథకాన్ని అమలు చేయాలంటే అత్యున్నత స్థాయిలో ఈప్రమాణాలు అత్యవసరమని, ఒక బిజెపి సభ్యుడిగా కాక, అనేక ఏళ్ల పాటు వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొన్న ఓ పోలీసు అదికారిగా తాను ఈ విషయం చెప్తున్నానని, ఇది ఒక కష్టమైన పని కాదన్నారు.