పెట్రో ధరలను తగ్గించకపోవడానికి యూపీఏ విధానాలే కారణం: నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు భారంగా మారిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా చర్యలు తీసుకుని ఇంధన ధరలు తగ్గిస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు ఎలాంటి ఊరటా లభించడంలేదు. పెట్రోల్, డీజిల్లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
పెట్రో ధరల పెరుగుదలకు యూపీఏనే కారణం..
అయితే, గత ఏడేళ్లకు ముందు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు విధానాలే ఇందుకు కారణమని ఆమె వ్యాఖ్యానించారు. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను జారీ చేసిందని ఆరోపించిన ఆమె.. సదరు ఆయిల్ బాండ్లపై ఇప్పటికీ తమ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు.
యూపీఏ చేసిన బకాయిలను చెల్లిస్తున్నామన్న నిర్మల
ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆయిల్ బాండ్లపై ఎన్డీఏ సర్కార్ రూ.60 వేల కోట్ల వడ్డీ చెల్లించినట్లు తెలిపిన నిర్మలా సీతారామన్... ఇంకా రూ.1.3 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. యూపీఏ హయాంలో రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల జారీ చేయడంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని.. కానీ, ఆయిల్ బాండ్ల భారం తమ ప్రభుత్వంపై పడిందని.. వాటి కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
యూపీఏ బాండ్ల భారం లేకుంటే పెట్రో ధరలు ఇప్పటికే తగ్గించేవాళ్లం
యూపీఏ చేసిన బాండ్ల భారం గనుక లేకుంటే తప్పకుండా చమురు ధరల భారం నుంచి విముక్తి కల్పించేవాళ్లమని తెలిపారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించకపోవడానికి ఇదే కారణమని కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ వివరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటే తప్ప పరిష్కార మార్గం లేదని.. ఇప్పటికైతే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే సమస్యే లేదు స్పష్టం చేశారు. రానున్న పండగల సీజన్కు ఉత్పత్తులకు గిరాకీ పెరిగి.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తంచేశారు. కేబినెట్ ఆమోదం కోసం క్రిప్టో కరెన్సీ బిల్ ఎదురు చూస్తోందని తెలిపారు.
కేరళకు కేంద్రం అత్యవసర కరోనా ప్యాకేజీ
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కేరళకు కేంద్రం సాయం ప్రకటించింది. కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళ రాష్ట్రానికి రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా. కేరళ రాజధాని తిరువనంతపురం వెళ్లిన మాన్సుఖ్ మాండవియా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్, ఆరోగ్య మంత్రి వీనా జార్జ్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.. ప్రస్తుతం కరోనా పరిస్థితి, తీసుకోల్సిన చర్యలపై ఆరా తీశారు. కేరళలకు కరోనా అత్యవసర ప్యాకేజీ కింద రూ.267.35 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన మాన్సుఖ్ మాండవియా.. రాష్ట్ర ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కోసం ఇది సహాయపడుతుందని చెప్పారు. అంతేగాక, మెడిసిన్ పూల్ కోసం ప్రతి జిల్లాకు కోటి చొప్పున అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో టెలీ మెడిసన్ సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఇక, కరోనా థర్డ్ వేవ్పై హెచ్చరికల నేపథ్యంలో ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో పిల్లల ఐసీయూ, పది కిలో లీటర్ల ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్ను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.