హైదరాబాద్లో రూ.100 దాటిన పెట్రోల్: విజయవాడలో ఇంకా పైపైకి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు దయాదాక్షిణ్యాలనేవి లేకుండా వ్యవహరిస్తోన్నట్లు కనిపిస్తోంది. రేట్లను పెంచడంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. ఇంధన ధరలను పెంచడమే తమ ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నట్టున్నాయి. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్ను దాటేసింది. ఒకట్రెండు చోట్ల డీజిల్ కూడా ఆ మార్క్ను అందుకుంది. తాజాగా 100 రూపాయల క్లబ్లో హైదరాబాద్ కూడా చేరింది.
వైఎస్ జగన్కు మళ్లీ రఘురామ లేఖ: పాదయాత్ర హామీని గుర్తు చేస్తూ: కోర్టులతో లింక్ పెట్టి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 29 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.96.41, డీజిల్ 87.28 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 102 మార్క్ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.102.58 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 94.70కి చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 97.69, డీజిల్ ధర రూ. 91.92, కోల్కతలో పెట్రోల్ రూ.96.34 పైసలు, డీజిల్ ధర రూ.90.12 పైసలు పలుకుతోంది.
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.20 పైసలుగా నమోదైంది. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.95.14 పైసలు. విజయవాడలో ఈ రేటు మరింత అధికంగా ఉంది. అక్కడ పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.102.66 పైసలకు చేరింది. డీజిల్ ధర రూ.95.41 పైసలుగా రికార్డయింది. విశాఖపట్నంలో పెట్రోల్ రేటు రూ.101.35 పైసలు, డీజిల్ ధర రూ.95.41 పైసలు పలుకుతోంది. ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటేసింది. భోపాల్లో పెట్రోల్-104.59, డీజిల్-95.91 రూపాయలకు చేరింది. రాంచీలో పెట్రోల్ రూ.92.51, డీజిల్ 92.13. బెంగళూరులో పెట్రోల్ రూ.99.63, డీజిల్ 92.52, పాట్నాలో పెట్రోల్ రూ.98.49 పైసలు, డీజిల్ రూ.92.59 పైసలు,చండీగఢ్లో పెట్రోల్ రూ.92.73, డీజిల్ రూ.86.92, లక్నోలో పెట్రోల్ రూ.93.63, డీజిల్ రూ.87.68 పైసలు పలుకుతోంది.
నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో 102 రూపాయలకు పైగా దీని ధర చేరగా.. రత్నగిరి, పర్భణీ, ఔరంగాబాద్, రాజస్థాన్లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్వారా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్మగళూరు, శివమొగ్గ, దావణగెరె వంటి చోట్ల వంద రూపాయలను దాటేసింది.