Fuel Prices: పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై తేల్చేసిన కేంద్రం..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా చమురు ధరల (Fuel Prices)పెంపు తప్పదనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇవాళ ఉదయం కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేట్లను ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయలు పెంచేసిన కేంద్రం.. ఇదే క్రమంలో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా త్వరలో పెంచేస్తుందంటూ విపక్ష నేత రాహుల్ గాందీ ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం చమురు ధరల పెంపు తప్పదని తేల్చేసింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో పెరుగుతున్న నష్టాలు, ప్రస్తుత ప్రపంచ ఇంధన మార్కెట్ పరిస్థితులను కారణంగా చూపుతూ చమురు ధరలను పెంచేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేసింది. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగడం, నిలిచిపోయిన శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ నాయకుల మధ్య మాటల యుద్ధం కారణంగా ఈ వారం అంతర్జాతీయ ముడి చమురు ధరలు బ్యారెల్కు 126 డాలర్ల వద్ద నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఆ తర్వాత కొద్దిగా తగ్గినా బ్యారెల్కు 110 డాలర్ల పైనే కొనసాగాయి.

త్వరలో పెట్రో ధరల పెంపు ? ఇవాళ గ్యాస్ రేట్ల పెంపు తర్వాత అదేనా..!
ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత నాలుగేళ్లుగా ధరలు పెంచలేదని చెబుతూనే, ప్రపంచ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడుతామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హామీ ఇచ్చారు. సమయం వస్తే, ప్రభుత్వం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు, దేశీయ ఎల్పిజి రేట్లను పెంచడం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) తెలిపింది. అయితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలకు అనుగుణంగా వాణిజ్య ఎల్పిజి, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పిజి, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఫ్యూయల్ ధరలను పెంచాయి.













Click it and Unblock the Notifications