గజ ఎఫెక్ట్ : భారీ వర్షాలు.. ఏడుగురు మృతి
Recommended Video
చెన్నై : నైరుతి బంగాళాఖాతంపై పంజా విసిరిన గజ తుపాను తీర ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. గురువారం రాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నాగపట్నం - వేదారణ్యం మధ్య తీరం దాటింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తంజావూరు జిల్లా అధిరామ్ పట్నంలో అత్యధికంగా 16సెంటిమీటర్ల వర్షపాతం రికార్డయింది. నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో ఆస్తినష్టం సంభవించింది.
నాగపట్నం, తిరువాయూరు, పుదుకొట్టై జిల్లాల్లో చెట్లు, పెంకుటిళ్లు కూలిపోగా.. కీచనకుప్పం, అక్కరైపెట్టై ప్రాంతాల్లో నివాసముండే మత్స్యకారుల ఇళ్లల్లోకి సముద్రపు నీరు చేరింది. మరోవైపు నాగపట్నం, కడలూరు, పుదుకొట్టై, కారైక్కల్, తిరువాయూర్, తంజావూర్, త్రిచి జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరువాయూర్, తంజావూర్, పుదుకొట్టై, త్రిచి, అరియలూర్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడు ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులు ఎన్డీఆర్ఎస్ బృందాలు, ఫైర్ సిబ్బది సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తమిళనాడు తీర ప్రాంత భద్రతా దళం హెచ్చరించింది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కడలూరు - చెన్నై హైవేని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి మైలడుదురై నుంచి వెళ్లాల్సిన కొన్ని రైళ్లను నిలిపివేయగా.. మరికొన్నింటిని విరుదాచలం వైపు మళ్లించారు. నాగపట్నం, తిరువాయూర్, తంజావూర్, పుదుకొట్టై, త్రిచి, అరియలూర్, మధురై, తేని జిల్లాలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు. తొలుత గజ తుపాను ఏపీ వైపు వస్తుందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. అది తమిళనాడు వైపు వెళ్లడంతో రాయలసీమ, దక్షిణ కోస్తాకు ముప్పు తప్పిందని తెలిపారు.