బీజేపీకి అధికారం: గాలి జనార్దన్ రెడ్డి ఎంట్రీ, 2008 సీన్ రిపీట్, ఆపరేషన్ కమల, ఆపద్బాంధవుడు!
బెంగళూరు: కర్ణాటకలో 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ అధికారంలోకి రావడానికి నానా తంటాలుపడవలసిన పరిస్థితి ఎదురైయ్యింది. బీజేపీ 104 సీట్లు కైవసం చేసుకున్నా అధికారంలోకి రావడానికి పూర్తి మెజారిటీ మాత్రం లేదు. ఆపరేషన్ కమల సక్సస్ కావడానికి గతంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ సహాయం తీసుకోవాలని కర్ణాటకలోని బీజేపీ నాయకులు నిర్ణయించారని తెలిసింది. 2008లో యడ్యూరప్పకు ఆపద్బాంధవులుగా నిలిచిన గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు మళ్లీ రంగంలోకి దిగుతున్నారని సమాచారం.
రిసార్టు రాజకీయాలు
బీజేపీకి అధికారం తప్పించడానికి పాతకక్షలు పక్కన పెట్టిన కాంగ్రెస్, జేడీఎస్ ఇప్పుడు ఒక్కటై అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే ఆపరేషన్ కమలకు భయపడిన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు రిసార్టు రాజకీయాలకు సిద్దం అయ్యారు.
రెడ్డి బ్రదర్స్, శ్రీరాములు
బాదామిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతిలో అతిస్వల్ప మెజారిటీతో ఓడిపోయిన బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు మాళకాల్మూరులో ఘనవిజయం సాధించారు. బళ్లారి గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన శ్రీరాములు జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ కమలతో బీజేపీలోకి తీసుకు వచ్చి కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావాలని పక్కా ప్లాన్ వేశారని తెలిసింది.
2008లో రెడ్డి పవర్
2008లో కర్ణాటకలో బీజేపీకి ఇప్పుడు ఎదురైన పరిస్థితి అప్పుడు ఎదురైయ్యింది. ఆ సందర్బంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, శ్రీరాములు కలిసి స్వాతంత్ర పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆపరేషన్ కమల పేరుతో బీజేపీలోకి తీసుకు వచ్చారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి యడ్యూరప్పను సీఎం చేసిన గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు ఆయనకు ఆపద్బాంధవులుగా నిలిచారు.
కాంగ్రెస్ లీడర్ ఎవరు
మరో వర్గం కథనం మేరకు కాంగ్రెస్ లోని ఓ శక్తివంతమైన నాయకుడిని వెనుక డోర్ నుంచి బయటకు తీసుకువచ్చి ఆ పార్టీలోని కొందరు శాసన సభ్యులను బీజేపీలోకి లాక్కోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. సిద్దరామయ్య, కాంగ్రెస్ మీద వ్యతిరేకత చూపించి ఆ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి సహాయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అయితే కాంగ్రెస్ లోని ఆ శక్తివంతమైన నాయుడు ఎవరు అనే విషయం బయటకురావడం లేదు.
లింగాయుత ఎమ్మెల్యేలు
లింగాయుతలకు ప్రత్యేక మతం కోసం జరిగిన పోరాటం, లింగాయుతలు, వీరశైవులను వేరు చెయ్యాలని చేసిన ప్రయత్నాలతో అసహనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. లింగాయుతలను మైనారిటీలుగా గుర్తించినా బీజేపీకి 60 శాతం ఓట్లు పడ్డాయి. లింగాయుతలకు ప్రత్యేక మతం, మైనారిటీ హోదా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి.