బ్లాక్మనీతోనే గాలి కుమార్తె పెళ్లి!: సీఐడీ ముందు ఒప్పేసుకున్న భీమ
గాలి తన కూతురు పెళ్లిని ఇంత ఆడంబరంగా చేయడానికి ధనాన్ని తానే సమకూర్చానని కేఏఎస్ అధికారి భీమానాయక్ అంగీకరించినట్లు సమాచారం.
బెంగళూరు: మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గాలి తన కూతురు వివాహానికి వందల కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ, సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా, గాలి తన కూతురు పెళ్లిని ఇంత ఆడంబరంగా చేయడానికి ధనాన్ని తానే సమకూర్చానని కేఏఎస్ అధికారి భీమానాయక్ అంగీకరించినట్లు సమాచారం. సీఐడీ అదుపులో ఉన్న భీమానాయక్ బుధవారం విచారణ సందర్భంగా తన తప్పును అంగీకరించినట్లు తెలిసింది.
గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చానని భీమానాయక్ అంగీకరించినట్లు సమాచారం. గాలితోనూ, బళ్లారి ఎంపీ శ్రీరాములుతోనూ తనకు సంబంధాలు ఉన్నాయని వీరి సూచనల మేరకే ఇదంతా చేశానని భీమానాయక్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డికి సమన్లు జారీ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. త్వరలోనే అతనికి సమన్లు జారీ చేసి, మరిన్ని ఆధారాలతో దర్యాప్తు చేపట్టనుంది. కాగా, గాలి నల్లధనం వ్యవహారం భీమా నాయక్ కారు డ్రైవర్ రమేష్ ఆత్మహత్య లేఖతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన రూ. 100కోట్ల పాత నోట్లను కొత్తవిగా మార్చినట్లు రమేష్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.