బీజేపీ లీడర్స్ కు అహంకారం, ఎందరిని ఏడిపించారు తెలుసా, జనార్దన్ రెడ్డి !
బెంగళూరు/బళ్లారి: బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులది అహంకారం కాదని, దురంహకారం అని గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ జీవితం పూర్తిగా తల్లకిందులు అయ్యింది. 2022 డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) పెట్టి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ తరపున అనేక నియోజక వర్గాల్లో చాలా మంది పోటీ చేశారు.

కోప్పళ జిల్లాలోని గంగావతి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఫుట్ బాల్ సింబల్ మీద పోటీ చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 8 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన గాలి జనార్దన్ రెడ్డి గంగావతిలో మీడియాతో మాట్లాడారు. తన కేఆర్ పీ పార్టీ నుంచి చాలా మంది పోటీ చేసి ప్రజల ఆశీస్సులు పొందారని, అయితే తాను ఒక్కడే విజయం సాధించానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
బళ్లారిలో పోటీ చేసిన తన భార్య లక్ష్మీ అరుణ ఆ నియోజక వర్గంలో గట్టిపోటీ ఇచ్చారని, మా కుటుంబంలోనే ఇద్దరు పోటీ ఉండటంతో తన భార్య ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిందని, వచ్చే ఎన్నికల్లో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు అందర్ని గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచి తాను పని చేస్తానని అన్నారు.
తాను బెంగళూరులోని విధాన సౌధలో త్వరలోనే అడుగుపెడుతానని, తన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని, ఏదో ఒకపార్టీకి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ప్రజలకే మంచిది అని గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీ గురించి అడిగిన ప్రశ్నకు గాలి జనార్దన్ రెడ్డి ఆయన శైలీలో సమాధానం ఇచ్చాను. తాను బీజేపీ అనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, ఆ ఇంటికి తనకు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ నాయకులకు దురంహకారం ఎక్కువ అయ్యిందని, అందుకే ఆ పార్టీకి ఈ పరిస్థితి ఎదురైయ్యిందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
బీఎస్ యడియూరప్ప లాంటి వ్యక్తిని సీఎం పదవి నుంచి తప్పించి ఆయన్ను ఏడిపించారని, ఎలాంటి ఆరోపణలు లేని జగదీష్ శెట్టర్ ను పార్టీ నుంచి బయటకు పంపించారని, తనని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలా చేశారని, అందరి ఉసురు తగిలి బీజేపీకి ఇలాంటి గతిపట్టిందని మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications