బెంగళూరులో ఇల్లు ఖాళీ చేసిన గాలి జనార్ధనరెడ్డి?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర వహించి ఒక్క వెలుగు వెలిగిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇల్లు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలోని రేస్ కోర్స్ రోడ్డులోని చాలుక్య సర్కిల్ లో గాలి జనార్థనరెడ్డికి ‘పారిజాత' అనే ఇల్లు ఉంది. వివిద కేసులలో గాలి జనార్థనరెడ్డి అరెస్టు కావడంతో 2011 సెప్టెంబర్ 5వ తేదిన ఆయనను అరెస్టు చేశారు. అప్పటి నుండి జైలులో ఉన్న గాలి జనార్థనరెడ్డి అన్ని కేసులలో బెయిల్ సంపాదించుకుని ఇటివల బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుండి విడుదల అయ్యారు.
తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల, కాళహస్తి వెళ్లి దైవదర్శనం చేసుకుని బెంగళూరులోని పారిజాత ఇంటికి చేరుకున్నారు. మూడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపిన కర్ణాటక మాజీ మంత్రిని కలవడానికి బళ్లారి నాయకులు, ఆయన సన్నిహితులు చాల మంది ప్రయత్నించారు. అయితే కొన్ని రోజుల నుండి గాలి జనార్థనరెడ్డి పారిజాత ఇల్లు ఖాళీగా ఉందని తెలుస్తోంది. గాలి జనార్థనరెడ్డి పారిజాత ఇంటిని ఖాళీ చేసి కుటుంబ సభ్యులతో కలిసి రహస్య ప్రాంతానికి వెళ్లి పోయారని వెలుగు చూసింది.
గదగ్లో గాలి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారని తెలిసింది. అయితే స్థానిక రాజకీయ నాయకుల వివరాల ప్రకారం అది నిజం కాదని బుధవారం తేలిపోయింది. అనేక కేసులలో ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్ధనరెడ్డిని హైదరబాద్, బళ్లారిలో అడుగు పెట్టరాదని, దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం అదేశించి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. బళ్లారి శివార్లలో నివాసం ఉండటానికి గాలి కొన్ని రోజుల నుండి ఎర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది.
గాలి జనార్దన్ రెడ్డికి అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు తెలుస్తోంది.