వచ్చే ఎన్నికల్లో 'గాలి' కోరుకుంటున్నది అదే!: కర్ణాటక రాజకీయంపై ఆసక్తికరం..
మాజీ సీఎం యడ్యూరప్పను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని, తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని ఆకాంక్షించారు.
బళ్లారి: ఊపిరి సలపని కేసుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన పొలిటికల్ రీఎంట్రీ కోసం కసరత్తులు మొదలుపెట్టేశారు. బీజేపీ నేతలతో టచ్లో ఉండటంతో పాటు క్షేత్రస్థాయిలతో ఆయన అనుచరులు ఇందుకోసం ప్లానింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం.
రీఎంట్రీ పక్కా అని తెలుస్తున్నప్పటికీ.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు తాను సిద్దంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు.
మైనింగ్ టైకూన్ రాజకీయ 'గాలి' ఎటువైపు?: రీఎంట్రీ తర్వాత పోటీ ఎక్కడి నుంచి?..
అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని, 'యడ్యూరప్పను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నానని' చెప్పుకొచ్చారు. తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.
కాగా, గురువారం నాడు అనుచరులు, సన్నిహితుల సమక్షంలో గాలి తన వివాహ రజతోత్సవ వేడుకలను హవంబావిలోని స్వగృహంలో జరుపుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంతకుముందు యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాలి.. మైనింగ్ కేసులతో జైలు పాలైనప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడేళ్ల జైలు శిక్ష అనంతరం గతేడాది విడుదలయ్యారు.
జైలు జీవితం అనంతరం తన పొలిటికల్ రీఎంట్రీ కోసం గాలి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు బీజేపీ అధిష్టానం కూడా సుముఖంగా ఉండటంతో ఆయన రాజకీయ పునరాగమనం ఖాయమని తెలుస్తోంది.