గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ మొదలైన మైనింగ్ కష్టాలు
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని ఆయన లెక్కలు చూపించినప్పటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం విదేశాలకు పంపించేశారని లోకాయుక్త అధికారులు గుర్తించారు.
కేసు దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త ప్రత్యేక బృందం అధికారులు (సిట్) సాక్ష్యాధారాలు సేకరించారు. సండూరు దగ్గర గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఎఎంసీ కంపెనీకి గనులు లీజ్ కు ఇచ్చారు. ఇక్కడ 10 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం తీసి తరలించడానికి అవకాశం ఇచ్చారు.
అయితే ఎఎంసీ కంపెనీ నిర్వహకులు ఐదు లక్షల ఇనుప ఖనిజం తీశామని రికార్డుల్లో చూపించారు. ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం అక్కడే ఉంది. అయితే ఎఎంసీ కంపెనీ పేరుతో అక్రమంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని లోకాయుక్త అధికారులు గుర్తించారు.
అందుకు సంబంధించిన రికార్డులను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
మూడు సంవత్సరాల నాలుగు నెలలు జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇదే సంవత్సరం జనవరిలో సుప్రీం కోర్టులో షరతులతో కూడిన బెయిల్ తీసుకుని జైలు నుండి బయటకు వచ్చారు. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే విషయం ఎవ్వరికి తెలియడం లేదు.