మోస్ట్ వాంటెడ్ క్రిమినల్... వికాస్ దూబే అరెస్ట్.. ఉజ్జయిని ఆలయంలో చిక్కిన గ్యాంగ్స్టర్..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్,గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గురువారం(జూలై 9) అతన్ని అరెస్ట్ చేశారు. ఆలయంలో అమ్మవారికి మొక్కుకునేందుకు వచ్చిన అతన్ని మొదటి సెక్యూరిటీ గార్డులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ భారీ సంఖ్యలో పోలీసులను వెంటపెట్టుకుని రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ఆలయ ఆవరణలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్స్లో అతని సన్నిహితులు ఇద్దరు హతమయ్యారు.
ఎలా చిక్కాడు...
పోలీసుల కథనం ప్రకారం... గురువారం ఉదయం 8గం. సమయంలో వికాస్ దూబే ఉజ్జయిని ఆలయం వద్ద ఉన్నట్లు సమాచారం అందింది. ఆలయంలో పూజలు చేసేందుకు అవసరమైన సామాగ్రి కొనుక్కుంటుండగా ఆ షాపు వ్యక్తి అతన్ని గుర్తించాడు. దీంతో ఆలయ సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేశాడు. అతను ఆలయం నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డులు అతన్ని ప్రశ్నించారు. దీంతో వికాస్ దూబే ఓ ఫేక్ ఐడీ కార్డును చూపించాడు.
బిగ్గరగా అరుస్తూ...
సెక్యూరిటీ సిబ్బంది గట్టిగా నిలదీయడంతో వాళ్ల పైనే దాడికి దిగాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ఎస్పీ మనోజ్ సింగ్ భారీ సంఖ్యలో పోలీసులను వెంట పెట్టుకుని ఆలయం వద్దకు వచ్చాడు. వికాస్ దూబేని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాను ఎక్కించాడు. ఆ సమయంలో 'నేను వికాస్ దూబేని... కాన్పూర్ వాలా..' అంటూ అతను బిగ్గరగా అరిచినట్లు తెలుస్తోంది.
సీఎం యోగికి సమాచారం...
వికాస్ దూబే అరెస్టుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్ర డీజీపీ వివేక్ జోహ్రి సమాచారం అందించారు. అనంతరం సీఎంవో కార్యాలయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సమాచారం అందించింది. 'వికాస్ దూబే నరరూప రాక్షసుడు. అతన్ని పట్టుకోవడం పోలీసులు సాధించిన పెద్ద విజయం. మధ్యప్రదేశ్ పోలీసులంతా అప్రమత్తంగా ఉన్నారు. ఉజ్జయిని ఆలయంలో అతన్ని అరెస్ట్ చేశారు. యూపీ పోలీసులకు సమాచారం అందించాం.' అని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
అనుచరుల ఎన్కౌంటర్.. తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో..!
వికాస్ దూబే అరెస్టుకు కొద్ది గంటల ముందే అతని అనుచరులిద్దరు ఎన్కౌంటర్స్లో హతమయ్యారు. ప్రభాత్ అనే అనుచరుడు హర్యానాలోని ఫరీదాబాద్లో ఎన్కౌంటర్ అవగా... బౌవ దూబే అనే మరో అనుచరుడు లక్నోకి 200కి.మీ దూరంలోని ఇతవహ్లో ఎన్కౌంటర్ అయ్యాడు. జూలై 3న కాన్పూర్లో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే గ్యాంగ్ 8 మంది పోలీసులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అతని దూబే సహా అతని అనుచరులు పరారీలో ఉన్నారు. దూబేపై ఇప్పటికే 60 కేసులు ఉన్నట్లు గుర్తించారు. దూబే అరెస్టుతో తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.