చెత్త గుట్టలు కనిపించవు: స్వచ్ఛ భారత్ మిషన్ 2.o ప్రారంభించిన ప్రధాని మోడీ, భారీగా నిధులు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నగరాల్లో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్బీఎం-యూ) 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) 2.0 పథకాలను శుక్రవారం ప్రారంభించారు ప్రధాని మోడీ.
న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్భన్ 2.0, అమృత్ 2.0 కార్యక్రమాలతో పట్టణీకరణ వేగవంతమవుతుందన్నారు. నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛభారత్ మిషన్ 2.0 లక్ష్యమని ప్రధాని మోడీ చెప్పారు. నగరాల్లో ఎక్కడా ఇక చెత్త గుట్టలుగా కనిపించదని అన్నారు.
రెండవ దశతో సీవేజ్ మేనేజ్మెంట్పై కూడా దృష్టి సారించామని, నగరాలన్నింటిలో నీటి భద్రతా చర్యలు కూడా చేపడుతామని తెలిపారు. దీనిలో భాగంగా బురద నీరు చెరువుల్లో చేరకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, సేఫ్టిక్ ట్యాంకులను నిర్మించడం లాంటివి చేపట్టనున్నట్లు ప్రధాని తెలిపారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్ మిషన్ 2.0 కీలకంగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రట్టణాభివృద్ధితో సమానత్వం సాధ్యమని.. దానికోసం ప్రణాళికలు రూపొందించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్భన్లో భాగంగా నగరాల్లో ఉన్న చెత్తను ప్రాసెస్ చేసి తొలగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఓ గార్బేజ్ ప్రదేశాన్ని మొదటగా శుభ్రం చేయనున్నట్లు మోడీ చెప్పారు.
This 2nd phase of Swachh Bharat Mission-Urban 2.0 & AMRUT 2.0 is also an important step in fulfilling dreams of BR Ambedkar. It's our privilege that today's program has been organised at BR Ambedkar Center. He believed that urban development was pivotal to equality: PM Modi pic.twitter.com/LGpUWD311d
— ANI (@ANI) October 1, 2021
దేశంలో ప్రతిరోజూ లక్ష టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. 2014లో స్వచ్ఛభారత్ మొదలు పెట్టిన సమయంలో కేవలం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధి చేసేవారని, ఇప్పుడు 70 శాతం చెత్తను శుద్ధి చేస్తున్నట్లు ప్రధాని మోడీ వివరించారు. 2014లో భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చేందుకు దేశప్రజలు నడుంబిగించారని తెలిపారు. అప్పటినుంచి 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణంతో ఓడీఎఫ్ కల నెరవేరినట్లు తెలిపారు.
The aim of Swach Bharat Mission 2.0 is to make the cities garbage-free. With this 2nd phase, we also aim sewage and safety management, making cities water-secure and ensuring that dirty nullahs don't merge into rivers: PM Modi on Swachh Bharat Mission-Urban 2.0 & AMRUT 2.0 pic.twitter.com/NwIYL4QIfd
— ANI (@ANI) October 1, 2021
ఇప్పుడు 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' లక్ష్యం చెత్త రహిత నగరాలుగా మార్చడమని.. ఈ నినాదాన్ని కూడా సంకల్పం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ అభియాన్, అమృత్ మిషన్ దేశానికీ గర్వకారణంగా నిలిచాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతోపాటు హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల సహాయ మంత్రి, అధికారులు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 పథకాలను నగరాలన్నింటినీ చెత్త రహితంగా.. నీటి భద్రతగా మార్చాలనే ఉద్దేశ్యంతో రూపొందించారు. 2030 నాటికి దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ పథకాలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. వీటికోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది.1.41 లక్షల కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.