గ్యాస్ బుక్ చేయాలంటే ఇవి తప్పనిసరి.. కీలక మార్పులు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియా యుద్ధ సెగలు ప్రపంచ దేశాలతోపాటు భారత్ నూ తాకాయి. ఈ క్రమంలో భారత్ లోనూ వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అటు ఎల్పీజీ గ్యాస్ బుకింగ్, డెలివరీలోనూ పలు కీలక మార్పులు చేశారు.
అయితే తాజాగా ఇండియన్ ఆయిల్, హెచ్ పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారుల కోసం ఎల్పీజీ సిలిండర్ బుకింగ్, సీఎన్జీ కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం, చమురు సంస్థలు కొన్ని ముఖ్యమైన నిబంధనలను మార్చాయి. ఈ రూల్స్ ను పాటించకపోతే గ్యాస్ కనెక్షన్ నిలిపివేయడమే కాకుండా సబ్సిడీ కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు లేదా అక్రమంగా ఉపయోగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఆధార్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ కేవైసీ పూర్తి చేయని వారికి భవిష్యత్తులో సిలిండర్ బుకింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేసింది. అలాగే సబ్సిడీ కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు వినియోగదారులు గ్యాస్ కంపెనీల అధికారిక యాప్ ద్వారా లేదా సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది.
అలాగే కొత్త నిబంధనల ప్రకారం సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ అథెంటికేషన్ కోడ్ చూపించడం తప్పనిసరి. మీరు సిలిండర్ బుక్ చేసినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు 4 అంకెల DAC కోడ్ వస్తుంది. సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తికి ఈ కోడ్ చెబితేనే సిలిండర్ అందిస్తారు. కాబట్టి వినియోగదారులు తమ కనెక్షన్ కు పనిచేసే మొబైల్ నంబర్ ను లింక్ చేసుకోవడం ముఖ్యం.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకే వ్యక్తి పేరు మీద లేదా ఇంటి చిరునామాపై ఒకటి కంటే ఎక్కువగా గ్యాస్ కనెక్షన్ లు ఉండకూడదు. ఒకవేళ వేరు వేరు కంపెనీల నుంచి ఒకే ఇంట్లో రెండు కనెక్షన్ లు ఉంటే అందులో ఒకదానిని సరెండర్ చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థలు సాఫ్ట్ వేర్ సాయంతో ఇటువంటి డూప్లికేట్ కనెక్షన్ లను గుర్తించి.. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే బ్లాక్ చేస్తున్నాయి.
సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా బుక్ చేసుకునే పద్ధతి కంటే డిజిటల్ విధానాలను ప్రోత్సహించడానికి చమురు సంస్థలు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి. వాట్సాప్, అధికారిక మొబైల్ యాప్ లు, ఉమాంగ్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే డిజిటల్ పేమెంట్లు చేసే వారికి ప్రత్యేక ఆఫర్లు, వేగవంతమైన డెలివరీ లభిస్తాయి. ప్రతి 5 సంవత్సరాలకు తప్పనిసరి భద్రతా తనిఖీ నిర్వహించనున్నారు. గ్యాస్ ఏజెన్సీకు చెందిన అధికారిక మెకానిక్ వచ్చి గ్యాస్ పైపులు, రెగ్యూలేటర్, స్టవ్ వంటి వాటిని తనిఖీ చేస్తారు.

ఇక ఇళ్లలో పైపెడ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న వినియోగదారులు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్ పీజీ సిలిండర్లను సరెండర్ చేయాలి లేదా సేఫ్ కస్టడీలో ఉంచాలి. ఒకే ఇంట్లో పీఎన్జీ కనెక్షన్, సబ్సిడీ ఎల్ పీజీ రెండింటినీ కలిపి ఉపయోగించడం పూర్తిగా నిషేధం విధించారు. అలాగే డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా వాడితే భారీ జరిమానా విధించనున్నారు.












Click it and Unblock the Notifications