అశోక్ గెహ్లాట్ 'విశ్వాస తీర్మానం'.. సాఫీగా సాగేనా.. అనూహ్యం జరుగుతుందా...
రాజస్తాన్ రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతూ వచ్చినా... చివరకు సచిన్ పైలట్ వెనక్కి తగ్గడంతో కథ సుఖాంతమైన సంగతి తెలిసిందే. నేటి(అగస్టు 14) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో... శాసనసభా వేదికగా జరగబోయే పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొదట బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించగా... కాషాయ పార్టీకి ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ మరో ఎత్తు వేసింది. తామే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

125 మంది ఎమ్మెల్యేల బలంతో గెహ్లాట్ సర్కార్...
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చాలా రోజులుగా బల నిరూపణ కోసం ఎదురుచూస్తున్నారు. సచిన్ పైలట్ ప్రభుత్వంపై ధిక్కారం వినిపించిన నాటి నుంచి.. గవర్నర్ చుట్టూ తిరుగుతూ అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతూ వచ్చారు. పలుమార్లు గెహ్లాట్ విజ్ఞప్తులను తిరస్కరించిన గవర్నర్... ఎట్టకేలకు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సచిన్ వర్గం తిరుగుబాటు బావుటా ఎగరేసినప్పుడు 102 మంది ఎమ్మెల్యేల మద్దతుతో స్వల్ప మెజారిటీని మాత్రమే కలిగివున్న గెహ్లాట్ సర్కార్... సచిన్ తిరిగి కాంగ్రెస్ శిబిరంలో చేరడంతో ఆ బలం 125కి చేరింది.

బీజేపీ అవిశ్వాసం వ్యూహాత్మకం...
ప్రస్తుతం బీజేపీకి కేవలం 72 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. కాంగ్రెస్ బలాన్ని సవాల్ చేసేందుకు ఈ నంబర్ ఏమాత్రం సరిపోదు. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వంలో బయటపడ్డ ఇటీవలి లుకలుకలను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం కలిగేలా చేయాలనే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గతంలో అవిశ్వాస తీర్మానం ఆలోచనే లేదంటూ చెప్పుకొచ్చిన బీజేపీ... ఇప్పుడు వ్యూహాత్మకంగా దాన్ని ముందుకు తెచ్చింది.

రాజే మౌనం వెనుక...
కాంగ్రెస్లో సంక్షోభం కొనసాగినన్ని రోజులు బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చిన ఆ పార్టీ ముఖ్య నేత,మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. గురువారం(అగస్టు 13) జైపూర్లో నిర్వహించిన పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నారు. సచిన్ పైలట్ను తమవైపుకు తిప్పుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగించినప్పుడు రాజే మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. సచిన్ పైలట్ బీజేపీలో చేరితే ఎక్కడ తనకు పోటీగా మారుతాడోననే ఆమె మౌనంగా ఉండిపోయారన్న ప్రచారం ఉంది. జైపూర్ సమావేశంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న దానిపై సమాలోచనలు జరిపినట్లు సమావేశ అనంతరం బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా పేర్కొన్నారు.
Recommended Video

సచిన్ ఝలక్ ఇస్తే తప్ప...?
సచిన్ పైలట్ వర్గం తిరిగి గెహ్లాట్ సర్కార్తో చేరడంతో కాంగ్రెస్కు మరో 19 మంది సభ్యుల బలం చేకూరింది. సచిన్ పైలట్ మళ్లీ అనూహ్య ఝలక్ ఇస్తే తప్ప గెహ్లాట్ సర్కార్కు వచ్చిన ముప్పేమీ లేదు. ఈ నేపథ్యంలో నేటి శాసనసభా సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications