సీబీఎస్ఈలో షాకింగ్ ప్రశ్నలు: లింగ వివక్షతను ప్రోత్సహించేలా, పురుషాధిక్యాన్ని సమర్థించేలా
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన సెకెండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షల చుట్టూ వివాదాల ముసురుకుంటున్నాయి. రాజకీయంగా కూడా దుమారం చెలరేగుతోంది. ప్రశ్నపత్రాన్ని రూపొందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ దిద్దుబాటు చర్యలను పూనుకుంది. ఈ ప్రశ్నాపత్రంపై విచారణకు ఆదేశించింది.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్.. ఈ తాజా వివాదాలకు కారణమైంది. లింగ వివక్షతను మరింత ప్రోత్సహించేలా, జెంటర్ స్టీరియోటైపింగ్ను సమర్థించేలా, తిరోగమనానికి దారి తీసేలా ఇందులోని ప్రశ్నలు ఉన్నాయంటూ నిపుణులు విమర్శిస్తున్నారు. మహిళలకు వ్యతిరేకంగా, వారిని వంటింటికి మాత్రమే పరిమితం చేసేలా, పురుషాధిక్యాన్ని చాటి చెప్పేలా ఈ ప్యాసేను రూపొందించారంటూ మండిపడుతున్నారు.
ఈ ప్యాసేజ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై భగ్గుమంటున్నాయి. ప్రశ్నాపత్రాలను రూపొందించిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. పురుషాధిక్య ప్రపంచాన్ని మరోసారి తెర మీదికి తీసుకుని వచ్చేలా.. విద్యార్థుల్లో కేంద్ర ప్రభుత్వం బీజాలను నాటే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోన్నాయి. మహిళలను వంటింటికే పరిమితం చేసేలా ప్రశ్నలను రూపొందించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారంటూ నిలదీస్తోన్నాయి.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం స్పందించారు. దీన్ని నమ్మలేకపోతున్నానంటూ అన్నారు. ఇంత హీన స్థాయిలో విద్యార్థులకు చదువు చెబుతున్నామా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ.. మహిళల పట్ల తనకు ఉన్న వ్యతిరేక అభిప్రాయాన్ని ఈ ప్యాసెజ్ కుండబద్దలు కొట్టినట్టయిందని అన్నారు. ఇదే రకమైన భావజాలాన్ని విద్యార్థుల్లో నాటడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మహిళలపై పురుషుల ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా ఈ ప్రశ్నాపత్రాన్ని కేంద్రం ఎందుకు రూపొందించిందని నిలదీశారు.
Recommended Video
మహిళా సమాజానికి వ్యతిరేకంగా, పురుషాధిక్యాన్ని ప్రోత్సహించేలా ఈ ప్రశ్నాపత్రాన్ని రూపొందించడాన్ని తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధురాలు లక్ష్మీ రామచంద్రన్ మతిలేని చర్యగా అభివర్ణించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇలాంటి చదువులేనా చెప్పేది.. అంటూ నిలదీశారు. దీనిపై సీబీఎస్ఈ బోర్డు అధికారులు.. సంబంధిత మంత్రిత్వ శాఖ సమగ్ర వివరణ ఇవ్వాలని, విద్యార్థులు, మహిళలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.