ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్న ''గులాంనబీ ఆజాద్''?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నారు. సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగిన ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. లేఖను అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న తరుణంలో అందుకు గల కారణాలేంటని ఆయన కొన్నాళ్లు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. జీ23 నేతల్లో ఆయన కూడా ఒకరు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలంటూ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

లోపాలు ఎక్కడున్నాయో పరిశీలించలేదు..
పార్టీ ఎందుకు ఓడిపోతుందనేది సీనియర్ రాజకీయవేత్తలుగా ఉన్నవారికే అర్థమవ్వాలికానీ జూనియర్లకు కాదు. లోపాలు ఎక్కడున్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? బాధ్యత గల పదవిలో ఉన్నందుకు, అధిష్టానం తమపై నమ్మకం ఉంచినందుకు ఇతర సీనియర్ నేతలతో కలిసి కాంగ్రెస్ కు జవసత్వాలు ఎలా తీసుకురావాలి? లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సింది ఆజాద్ లాంటి నాయకులే. కానీ తనకు జీవితకాలం ఎంతో ఇచ్చిన పార్టీకి రాజీనామా లేఖను సమర్పించిన ఈ తరహా నాయకులను వదిలించుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కారణాలు తెలియనివేం కాదు..
రాహుల్ పగ్గాలు చేపట్టిన తర్వాతే పార్టీ ఓటమిపాలవుతుందని చెబుతున్న ఆజాద్ కు అందుకు కారణాలు తెలియనివేం కాదు. కేంద్రంలో మోడీ, షా నాయకత్వంలోని సర్కారు పూర్తి మెజారిటీతో కొనసాగే ప్రభుత్వాలనే నిలవనీయడంలేదు. అటువంటిది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అందులోను గతంలో సీబీఐ, ఈడీలతో తమను వేటాడిన పార్టీకి అంత తేలిగ్గా అధికారం వదలుకోరనేది అందరికీ తెలిసిన విషయమై. మోడీ, షాలను వ్యతిరేకించే విపక్షాలను, ముఖ్యంగా ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలతో చర్చించి కూటమి ఏర్పాటు చేయడం, పెద్దన్న పాత్ర పోషించడం, తగ్గాల్సిన చోట తగ్గడం లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అవేమీ చేయలేదు.

యువరక్తంతో జవసత్వాలు
జీ23 పేరుతో అధినాయకత్వంపై విమర్శలు గుప్పిస్తే పార్టీ ఆజాద్ ను తీవ్రంగా హెచ్చరించింది. మరోసారి పునరావృతమైతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. తనలాంటి సీనియర్ నేతకు ఇటువంటి హెచ్చరికలు రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పొడిగించలేదు. కపిల్ సిబల్ లాంటి నేత సమాజ్ వాదీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. అప్పటినుంచే ఆజాద్ పార్టీని వీడతారంటూ వార్తలు వచ్చాయి. పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేయకుండా హుందాగా తప్పుకొని ఉంటే ఆయనకు కొంత గౌరవం లభించేది. కానీ ఇప్పుడు అదికూడా లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి కొంతకాలంగా సీనియర్ నేతలు గుదిబండల్లా మారారని, పేరుకే సీనియర్లేకానీ వారికి బలమైన అనుచర గణంకానీ, ఎన్నికల్లో పార్టీని గెలిపించగల సత్తాకానీ లేదని తేటతెల్లమవుతోంది. ఇటువంటి నేతలంతా పార్టీని వీడుతుండటంవల్ల పార్టీలోకి యువరక్తాన్ని ఎక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications