గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ
కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న సీనియర్ రాజకీయవేత్త గులాం నబీ ఆజాద్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆయన జమ్ములో జరగబోయే భారీ ర్యాలీలో ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి జమ్ము చేరుకోనున్న ఆజాద్కు భారీగా స్వాగతం పలికేందుకు ఆయన మద్దతుదారులు ఏర్పాట్లు చేశారు.
భారీ ర్యాలీతో సైనిక్ కాలనీకి వెళ్లి బహిరంగసభలో ప్రసంగిస్తారు. దాదాపు 20వేల మంది దీనికి హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. జాతీయ పార్టీనే ప్రకటిస్తారని, ముందుగా జమ్ముకాశ్మీర్ తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు. కాశ్మీర్లో ఆజాద్కు మద్దతుగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వీడారు. వీరంతా సభకు హాజరుకాబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆజాద్ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన జీ-23 నేతల్లో ఆజాద్ కూడా ఒకరు. జమ్ము-కాశ్మీర్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆజాద్ పనిచేయబోతున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు.