యువతిపై గ్యాంగ్రేప్, హత్య: నగ్న మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు
సిలిగురి/కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కొందరు దుండగులు, ఆ తర్వాత ఆమెను హత్య చేసి నగ్నంగా రైలు పట్టాలపై పడేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 13మంది నిందితులపై కేసు నమోదు చేసుకున్న ధూప్గురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంగళవారం బాధితురాలి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జల్పాయిగురి ఏఎస్పీ జేమ్స్ కుజుర్ తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి తండ్రి వ్యవసాయ పనుల నిమిత్తం ఓ ట్రాక్టర్ను అద్దెకు తీసుకున్నాడు. అయితే అద్దె చెల్లించాల్సిన సమయానికి అతడు కట్టలేకపోయాడు. సోమవారం రాత్రి కంగారు కోర్టు(గ్రామ పెద్దలు) ముందు ట్రాక్టర్ యజమాని ఈ విషయాన్ని తీసుకొచ్చాడు. అద్దె మొత్తం చెల్లించేందుకు తనకు కొంత సమయం కావాలని బాధితురాలి తండ్రి కంగారుకోర్టును కోరాడు. అందుకు కంగారుకోర్టు నిరాకరించింది.

ఈ సమావేశానికి ధూప్గురి మున్సిపాలిటీకి చెందిన ఓ తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా హాజరయ్యాడు. కాగా, ఈ సమావేశంలో పెద్దల ముందు కొందరు స్థానికులు బాధితురాలి తండ్రిని కొట్టడం మొదలుపెట్టారు. తన తండ్రిని కొట్టొద్దని ఆ యువతి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెను కొందరు పక్కకు లాక్కెళ్లారు. అప్పటి నుంచి ఆమె కనిపించలేదు.
కాగా, మంగళవారం ఆమె మృతదేహం సమీపంలోని రైలు పట్టాలపై నగ్నంగా పడివుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇలాంటి క్రూరమైన ఘటనలు ఇప్పటి వరకు చూడలేదని సిపిఎం నేత అనిసూర్ రహమాన్ అన్నారు.
చీకటి రోజుగా ప్రకటించిన ఆందోళనకారులు ధూప్గురి గుండా వెళ్తున్న 31వ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ధూప్గురి పోలీస్స్టేషన్ ఎదుట పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
ఇది ఇలా ఉండగా బాధిత యువతి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని జిల్లా టిఎంసి అధ్యక్షుడు సౌరవ్ చక్రవర్తి తెలిపారు. అయితే ఆమె మృతిపై పోలీసులు విచారణ చేపట్టాలని చెప్పారు. తాము పోలీసులను ప్రభావితం చేయడం లేదని అన్నారు. టిఎంసి నేతలు ఎవ్వరూ ఈ ఘటనలో భాగస్వాములు కాలేదని అనుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications