స్టూడెంట్పై లేడీ టీచర్ పగబడితే.. 15 ఏండ్ల అమ్మాయిపై దారుణం
విద్యార్థులు తెలిసో, తెలియకో తప్పు చేస్తే టీచర్లు సున్నితంగా మందలించి వదిలేస్తారు. కానీ ఓ లేడీ ప్రిన్సిపల్, ఇంకొందరు టీచర్లు మాత్రం స్టూడెంట్ పై ఏండ్లపాటు విపరీతంగా కక్ష పెంచుకుని.. ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడ్డారు. సంచలనంగా మారిన ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈస్ట్ ముంబై ఏసీపీ లక్మీ గౌతమ్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
టీచర్ల రాక్షసత్వం..
ముంబైలోని కంజుర్ మార్గ్ ఏరియాకు చెందిన 15 ఏండ్ల విద్యార్థిని ప్రస్తుతం డిప్లొమా చదువుతోంది. మొన్న ఆదివారం మార్నింగ్ వాక్ కోసం బయటికెళ్లిన ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లే ఈ దాడి చేశారు. ‘నిన్నేకాదు.. మీ ఫ్యామిలీ మొత్తాన్ని యాసిడ్ పోసి చంపేస్తాం'అని వార్నింగ్ కూడా ఇచ్చారు. దాడి తర్వాత ఎలాగోలా తండ్రికి ఫోన్ చేసిన బాలిక, ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మాటువేసి దాడి చేశారు..
బాధిత విద్యార్థిని తొమ్మిదో తరగతి చదివేరోజుల్లో.. ఓసారి టీచర్లు అకారణంగా కొట్టారని పేరెంట్స్ కు చెప్పుకుంది. స్కూలుకి వచ్చి గొడవ చేసిన పేరెంట్స్.. తమ బిడ్డని కొట్టిన ప్రిన్సిపల్, టీచర్లపై కేసు పెట్టారు. తమ పరువు, స్కూల్ పరువు తీసిందన్న కోపంతో అమ్మాయిపై కక్ష పెంచుకున్న టీచర్లు టైమ్ కోసం ఎదురుచూశారు. ఆదివారం ఉదయం ఆమె మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా, మాటువేసి యాసిడ్ అటాక్ చేశారు.
పరారీలో టీచర్లు..
యాసిడ్ దాడి తర్వాత టీచర్లు కారులో వెళ్లిపోయారి బాధిత విద్యార్థిని చెప్పింది. ఆమె వాగ్మూలం ప్రకారం ఐపీసీ 326బి, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్పారు. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. టీచర్లే యాసిడ్ దాడికి పాల్పడ్డారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది.