ఇద్దరూ మహిళలే: ఆగ్రాలో సహజీవనం, ఆపై పెళ్లి
న్యూఢిల్లీ: వాళ్లిద్దరూ మహిళలే అయినప్పటికీ, ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. వినడానికి ఇంది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఈ సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని ఓ పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్సు విభాగంలో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని స్థానికంగా బ్యూటీపార్లర్ నడుపుతున్న 25 ఏళ్ల మహిళను ఎంతగానో ప్రేమించింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్పింది.
ఇందుకు విద్యార్ధిని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో జనవరి 4న ఇంటి నుంచి పారిపోయింది. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు జనవరి 15న సమీప పోలీస్ స్టేషన్ తమ కూతరు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దీంతో బాలిక సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆగ్రాకు సమీపంలోని ద్వేరి అనే గ్రామంలో ఆ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. భారత్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవటం చట్ట సమ్మతం కానప్పటికీ, అయితే వారిద్దరూ 18 ఏళ్లకు మించిన వారు కావడంతో వారిపై చర్యలు తీసుకోలేమని ఓ పోలీసు అధికారి తెలిపారు.