4జీ స్మార్ట్ ఫోన్ కోసం బాయ్ఫ్రెండ్ను రోడ్డుపై చితక్కొట్టింది
ఆగ్రా: తాను అడిగిన వాట్సాప్ కలిగిన 4జీ ఫోన్ ఇవ్వనందుకు ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ పైన ప్రతాపం చూపించింది. నడి రోడ్డు పైన చాలామంది చూస్తుండగా అతనిని ఉతికి పారేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు చోటు చేసుకుంది.
మంగళవారం నాడు మధ్యాహ్నం కాలంది విహార్ ప్రాంతంలోని వంద ఫీట్ల వెడల్పు రోడ్డు పైన ఇది జరిగింది. సమాచారం మేరకు.. యువతి తన వద్ద పాత నోకియా ఫోన్ కలిగి ఉంది. ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.
తనకు నైనిటాల్లోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని అతను ఆ అమ్మాయికి చెప్పాడు. దీంతో ఆమె వాట్సాప్ ఉన్న 4జీ స్మార్ట్ ఫోన్ కావాలని డిమాండ్ చేసింది. అతనితో నిత్యం టచ్లో ఉండేందుకు ఆమె ఆ ఫోన్ అడిగింది.
అయితే, తాను నైనిటాల్ వెళ్లిన తర్వాత ఆ ఫోన్ పంపిస్తానని అతను చెప్పాడు. అయితే, తన కోరికను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి అతని చెంప చెల్లుమనిపించింది. ఆ తర్వాత అతనిని నెట్టివేసింది.
ఆ రోడ్డు ఎప్పుడూ బీజీగా ఉంటుంది. అలాంటి రోడ్డు పైన అతని పైన చేయి చేసుకుంది. స్థానికులు జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ జంటను తీసుకెళ్లి విచారించారు.
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ... ఆ యువకుడు మణిపురికి చెందిన వ్యక్తి అని, ఆ యువతి అతనికి దూరపు బంధువు అని చెప్పారు. ఇద్దరు కూడా చాలాకాలంగా రిలేషన్ షిప్లో ఉన్నారని చెప్పారు. పోలీసులు విచారించి, తల్లిదండ్రులను పిలిపించి, ఆ తర్వాత వారితో పంపించారు.