రేప్ చేసి, తుపాకితో కాల్చి బావిలో పడేశారు
న్యూఢిల్లీ: ఓ పదిహేనేళ్ల బాలిక పట్ల దుండగులు అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆమెపై వారం రోజులుగా అత్యాచారం చేసి, ఆమెను తుపాకితో రెండు సార్లు కాల్చి, మరణించిందని భావించి బావిలో పడేశారు. ఆమె పది గంటల పాటు సాయం కోసం కేకలు పెడుతూ చివరకు ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామంలో గల ఫామ్హౌస్లో చోటు చేసుకుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తాకథనం ప్రకారం - పశ్చిమ ఢిల్లీలోని ఇంటి నుంచి నవంబర్ 22వ తేదీన బాలికను కారులో కిడ్నాప్ చేశారు, గ్రేటర్ నోయిడాలోని ఓ వదిలేసిన ఫామ్హౌస్లో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత గత శనివారంనాడు ఆమె ఛాతీపై, కడుపుపై కాల్పులు జరిపారు. మరణించిందని భావించి బావిలో పడేశారు.
ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేదు. రక్తమోడుతున్న ఆ అమ్మాయి బావిలోంచి కేకలు వేయసాగింది. తన శరీరంలో ఓ బుల్లెట్ను స్వయంగా ఆమె తీసేసుకుంది. డిసెంబర్ 6వ తేదీన ఆ పొలం యజమాని మేనల్లుడు ఆడుకుంటూ బావి వద్దకు వచ్చాడు. అతనికి అమ్మాయి అరుపులు వినపించాయని, తాను తాను అతడి మాటలు నమ్మలేదని, తర్వాత వెళ్లి చూస్తే నిజంగానే బాలిక అరుపులు వినిపించాయని, పోలీసులకు విషయం చెప్పి బావిలోకి తాళ్లు వేశానని పొలం యజమాని చెప్పాడు.
ఆమెను జాగ్రత్తగా పైకి లాగి, వివస్త్రగా ఉండడంతో ఆమె ఒంటిపై దుప్పటి కప్పారు. తర్వాత ఆమమను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు క్రిషన్ కొద్ది నెలలుగా తనకు తెలుసునని బాలిక చెప్పింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు.
చివరగా ఇంటికి తీసుకుని వెళ్తామని చెప్పి వారు బాలికను దాహం తీర్చుకోవడానికి ఓ బావి వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. క్రిషన్ ఆమెను పట్టుకుని కొట్టాడు, రెండు సార్లు ఆమపై కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు బుల్లెట్లు ఆమె శరీరంలోని అంగాలను నష్టపరచలేదు.