తిండి పెట్టండి లేదా చంపేయండి: యూపీ మహిళ వినూత్న నిరసన, తలపట్టుకున్న అధికారులు!
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ నిరుపేద మహిళ వినూత్న నిరసనకు దిగింది. తనకు తిండి పెట్టాలని లేదంటే చంపేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డు పట్టుకుని బైటాయించింది. దీంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి.
ఝాన్సీ ప్రాంతానికి చెందిన నర్గిస్ అనే మహిళ.. కలెక్టర్ కార్యాలయానికి వచ్చి 'రోటీ దో యా ఫిర్ మౌత్ దో'(తిండి పెట్టండి లేదంటే చంపేయండి) అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని నిలుచుంది.
రోజువారీ కూలీగా పని చేస్తున్న ఆమె రేషన్ కార్డు పొందడం కోసం రూ.4 వేలు చెల్లించింది. నిజానికి చౌక ధరల దుకాణం నుంచి రేషన్ పొందేందుకు నిరుపేదలకు ఈ రేషన్ కార్డు ఉచితంగా ఇవ్వాలి. కానీ అంత డబ్బు చెల్లించినా ఆమెకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు.
ఆమె రేషన్ కార్డు దరఖాస్తుకు కాలదోషం పట్టిందని, మళ్లీ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు మరో రూ.4 వేలు సమర్పించుకోవలసిందేనని ఆమెకు స్పష్టం చేస్తుండడంతో.. తన వద్ద అంత డబ్బు లేదని, విడతలవారీగా చెల్లిస్తానని సంబంధిత అధికారులకు నర్గిస్ మొరపెట్టుకుంది.
అయినా అధికారులు ససేమిరా అనడంతో.. తినేందుకు తిండి లేక ఇక తనకు మరణమే శరణమని భావించిన ఆమె ఇలా నిరసనకు దిగింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని పోషించుకోవడం తనకు భారంగా మారిందని నర్గిస్ వాపోతోంది.
తన సమస్య గురించి కలెక్టర్కు మొరపెట్టుకుందామని వస్తే.. అధికారులు తనను అనుమతించడం లేదని, ఏం చేయాలో అర్థంకాక ఇలా ప్లకార్డు పట్టుకుని నిలుచున్నానని పేర్కొంది.
మరోవైపు ఆమె 'రోటీ దో యా ఫిర్ మౌత్ దో' అంటూ నిరసనకు దిగడంతో అధికారులు తల పట్టుకున్నారు. ఎక్కడ తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎలాగోలా నర్గిస్కు నచ్చజెప్పి అక్కడ్నించి పంపించేశారు.