చెన్నైలో విద్యుత్ షాక్ తో చిన్నారులు మృతి: ప్రభుత్వానికి వార్నింగ్, రూ. 10 లక్షలు పరిహారం !
తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహంప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఏం చేస్తున్నారుమృతుల కుటంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని మద్రాసు హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇలాగే నిర్లక్షం చేస్తే చూస్తూ సహించమని మద్రాసు హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది.
చెన్నైలోని కొడంగయూరులో బుధవారం విద్యుత్ తీగలు కిందపడటంతో వాటి మీద అడుగు పెట్టిన యువశ్రీ (9), భావన అలియాస్ మణిమేఘలై (7) అనే ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇద్దరు చిన్నారుల మృతిపై దాఖలు అయిన పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మండిపడింది.
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని విద్యుత్ స్థంభాలు ఉన్నాయి, మరమత్తులకు గురైన విద్యుత్ స్థంభాలు ఎన్ని ఉన్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్షం వలనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారని మద్రాసు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
మృతుల కుటంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు చెప్పింది.