గ్లోబల్ శాటిలైట్ కు మిసైల్ మ్యాన్ కలాం పేరు
బెంగళూరు: మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న, మిసైల్ మ్యాన్ దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కనుంది. ఒక గ్లోబల్ శాటిలైట్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదన చేశారు.
విపత్తుల నష్టాలను తగ్గించడం కోసం ఐక్యరాజ్యసమితి సహకారంతో రూపోందించిన గ్లోబల్ శాట్ ఫర్ డీఆర్ఆర్ కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. కెనడా-యూరప్-యూఎస్-ఆసియా అంతరిక్ష సాంకేతిక సంస్థ (సీఏఎన్ఈయూఎస్) చేర్మన్ మిలింద్ పిమ్ ప్రికర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ శాటిలైట్ కు యూఎన్ కలాం గ్లోబల్ శాట్ అనే పేరు మార్చాలని ప్రతిపాదించామని మిలింద్ పిమ్ ప్రికర్ తెలిపారు. జులై 27వ తేదిన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం షిల్లాంగ్ లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
గ్లోబల్ శాటిలైట్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టడానికి ఐక్యరాజ్య సమితిలో అధికారికంగా ఆమోదించవలసి ఉంది. సెప్టెంబర్ నెలలో న్యూయార్క్ లో జరిగే ఈ కాన్ఫరెన్స్ లో 150కి పైగా దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరౌతున్నారు.
స్పేస్ టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రపంచంలోని దేశాలలో విపత్తు నష్టాలను తగ్గించడమే లక్షంగా 1999లో కెనెడాలోని మాంట్రియల్ ప్రధాన కేంద్రంగా సీఏఎన్ఈయూఎస్ ను ఎర్పాటు చేశారు. ఈ సీఏఎన్ఈయూఎస్ కు కలాం విశేష సేవలు అందించారు.