గోవా ఎన్నికలు 2022: వివిధ పార్టీల నుంచి సీఎం అభ్యర్థులు వీరే..!!
పనాజీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్ప్రదేశ్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇక గోవాలో కూడా ఎన్నికల హీట్ పెరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ టఫ్ ఫైట్కు సిద్ధమవుతోంది. దీంతో గోవా ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. గోవాలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో 40 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు ఫీట్లు చేస్తున్నాయి.
Recommended Video

బరిలోకి ఆప్-తృణమూల్
గోవాలో అధికారిక బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నప్పటికీ... అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఎంటర్ కావడంతో ఈసారి ఎన్నికలు కాస్త ఇంట్రెస్టింగ్గా మారాయని చెప్పాలి. ఇక మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా తన అదృష్టాన్ని గోవాలో పరీక్షించుకుంటోంది. ఆ పార్టీ తరపున కూడా అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఆయా పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులపై ఓ లుక్కేద్దాం.

బీజేపీ అభ్యర్థిగా ప్రమోద్ సావంత్
ముందుగా అధికారిక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ బరిలో ఉన్నారు. ఈయన శాంక్విలెమ్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే బీజేపీ తరపున బరిలో దిగిన ప్రమోద్ సావంత్ రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్కు చెందిన ప్రమోద్ సావంత్ వృత్తి పరంగా డాక్టర్. డాక్టర్గా సేవలందిస్తూ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు. దివంగత మాజీ సీఎం మనోహర్ పారిక్కర్ మరణంతో ప్రమోద్ సావంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి
గోవాలో తన సత్తా చాటాలని భావిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ను ప్రకటించింది.ఓబీసీ భండారీ సామాజిక వర్గంకు చెందిన అమిత్ పాలేకర్... ప్రముఖ లాయర్ మరియు సామాజిక కార్యకర్త.నిత్యం నిరసనల్లో పాల్గొంటూ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తుండటంతో గోవాలో అమిత్ పాలేకర్ పేరు పాపులర్ అయ్యింది. గోవాలోని ఓ హెరిటేజ్ సైట్ వద్ద అక్రమ కట్టడాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రధాన వార్తల్లో నిలిచారు అమిత్ పాలేకర్.

సీఎం అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్
గోవాలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించి మిగతా పార్టీల సహాయంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 21 మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ సాధించలేకపోయింది. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. ఇక కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదు. ఇక ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ సారి గోవా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. గోవా మాజీ సీఎం మనోహర్ పారిక్కర్ కుమారుడు ఉత్పల్ పారిక్కర్ పంజీం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన తండ్రి మనోహర్ పారిక్కర్ 1994 నుంచి తన మరణం వరకు ఈ సీటు నుంచే పోటీ చేసి గెలిచారు. 2019లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన అతనాసియో మోన్సెరట్టేపై పోటీ చేస్తున్నారు ఉత్పల్ పారిక్కర్. ఇక మంత్రిగా పనిచేసిన మైఖేల్ లోబో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయన కాలాన్గుట్ నుంచి బరిలో దిగుతున్నారు.
మొత్తానికి గోవా ఎన్నికలు ఓ చిన్నపాటి యుద్ధాన్నే తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications