GOA ELECTIONS 2022 : 15 రోజుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో -10 న తొలి జాబితా : ఏఐసీసీ..!!
గోవా ఎన్నికల సమరంలో కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావు గోవాలో పర్యటించారు. గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ మరియు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మధ్య జరిగింది. గోవా ఫార్వర్డ్ పార్టీతో పార్టీ ఇంకా పొత్తు ఖరారు కాలేదని గుండూరావు చెప్పుకొచ్చారు.
2022 గోవా ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను 15 రోజుల్లో విడుదల చేస్తుందని, డిసెంబర్ 10 నాటికి అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని గోవా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దినేష్ గుండూరావు వెల్లడించారు. తమ మేనిఫెస్టోను 15 రోజుల్లో విడుదల చేస్తామని.. అందులో గోవా ప్రజలకు ఐదు ప్రధాన హామీలు ఉంటాయన్నారు. తమ మేనిఫెస్టో హామీలు మేం అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం.. డిసెంబర్ 10లోగా తొలి జాబితాను కూడా ప్రకటిస్తామని స్పష్టం చేసారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు గోవా ఫార్వర్డ్ పార్టీ మరియు స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. గోవా ఫార్వర్డ్, ప్రసాద్ గాంకర్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పటికే ఆప్ పార్టీ గోవా ఎన్నికల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇక్కడ యువత ఓట్ల పైన గాలం వేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య..ఉచిత వైద్యం నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఇక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సైతం గోవా ఎన్నికల్లో తమ అభ్యర్ధులను నిలబెడుతున్నారు.
బీజేపీ చాప కింద నీరులా తమ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అయిదు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామని చెబుతోంది. వాటిని పరిశీలించిన తరువాత ఇతర పార్టీలు సైతం త్వరలోనే తమ మేనిఫెస్టోలను బయట పెట్టే అవకాశం కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేయటం ద్వారా ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు..ప్రచారం చేసుకోవటానికి సమయం ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నెల 10వ తేదీన తొలి జాబితా వెల్లడిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.