Goa elections: క్రిస్టియన్ ఎమ్మెల్యేలు బీజేపీని వీడడం ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బే; ఆందోళనలో బీజేపీ
గోవాలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవాలోని క్రిస్టియన్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పి పార్టీని వీడి వెళుతున్నారు. సామూహిక ఫిరాయింపులు కాషాయ పార్టీకి తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ధైర్యం గా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీలో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా ఫిరాయింపుల కు పాల్పడడం బిజెపికి ఇబ్బంది కలిగించే అవకాశాలు లేకపోలేదు.

బీజేపీకి మంత్రి మైఖేల్ లోబో రాజీనామా .. భార్యకు టికెట్ ఆశిస్తున్న నేత
సోమవారం కలాంగుటే ఎమ్మెల్యే, మంత్రి మైఖేల్ లోబో ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా లోబో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, సియోలిమ్ నియోజకవర్గం నుండి తన భార్య దలీలాకు టికెట్ కోసం లోబో లాబీయింగ్ చేస్తున్నారు. కానీ బిజెపి అందుకు విముఖంగా ఉంది. ఇదిలా ఉంటే బిజెపి కి గుడ్ బై చెప్పిన మంత్రి మైఖేల్ సోమవారం సాయంత్రం కాంగ్రెస్లో చేరతారని ఊహాగానాలు బలంగా వినిపించాయి, అయితే అతని భార్య అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి ఆయన చేరిక సందిగ్ధంలో ఉంది.

మైఖేల్ లోబోతో పీకే చర్చలు.. 5 నుండి 6 నియోజకవర్గాలపై మైఖేల్ ఎఫెక్ట్
ఇదిలా ఉంటే గోవా రాజకీయాలలో చక్రం తిప్పాలని గోవా ఎన్నికల బరిలోకి దిగుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) కూడా రాజకీయ ప్రముఖులను తమ పార్టీలోకి తీసుకురావడానికి ఆసక్తిని చూపిస్తోంది. ఈ క్రమంలో టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మైఖేల్తో మాట్లాడినట్లు భావిస్తున్నారు.
కలంగుటే ఎమ్మెల్యే ఉత్తర గోవా నుండి బలమైన నాయకుడు మాత్రమే కాదు ఆయన కనీసం 5-6 నియోజకవర్గాలలో ప్రభావం చూపుతారని రాజకీయ వర్గాల అంచనా. లోబోను తనవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైతే, బీజేపీకి బలమైన ప్రాబల్యం ఉన్న ఉత్తర గోవాలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పొచ్చు.

బీజేపీని వీడి వెళ్తున్న క్రిస్టియన్ ఎమ్మెల్యేలు
అయితే, లోబో మాత్రమే పార్టీని వీడిన మొదటి బిజెపి ఎమ్మెల్యే కాదు. గత నెలలో కార్టోలిమ్ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీని వీడారు. అలీనా ఆప్లో చేరగా, వాస్కోకు చెందిన మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే కార్లోస్ అల్మేడా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు.ఇదిలా ఉండగా, మాయెమ్ నియోజకవర్గానికి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ జాంట్యే సోమవారం రాజీనామా చేశారు. జాంటీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)లో చేరే అవకాశం ఉంది. వెలిమ్ ఎమ్మెల్యే మరియు మంత్రి ఫిలిప్ నెరి రోడ్రిగ్జ్ మరియు నువెమ్ ఎమ్మెల్యే విల్ఫ్రే డిసా, అలియాస్ బాబాషన్ కూడా త్వరలో బిజెపిని విడిచిపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న చోట బీజేపీకి గడ్డు పరిస్థితి.. అందుకే ఆ ఎమ్మెల్యేలు జంప్
ఈ ఎమ్మెల్యేలు బీజేపీని వీడడానికి ప్రధాన కారణం బీజేపీ టిక్కెట్పై ఎన్నికల్లో పోటీ చేయడంలో అసౌకర్యమే అని తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలు క్రైస్తవులు అధికంగా ఉండే నియోజకవర్గాల నుండి గెలుపొందారు. ఇక ఆయా నియోజకవర్గాలలో బిజెపికి తక్కువ మద్దతు ఉంది. ఫలితాల భయంతో, ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, ఆప్ మరియు టిఎంసి వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని సమాచారం.
Recommended Video

ఫిరాయింపులపై గోవా సీఎం ట్వీట్ .. బయట ధైర్యంగా ఉన్నా లోపల భయమే
అయితే ఫిరాయింపులపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గోవాలో బీజేపీకి ఎదురులేదని ఆయన పేర్కొన్నారు. "భారతీయ జనతా పార్టీ మాతృభూమికి పూర్తి అంకితభావంతో సేవలందిస్తున్న పెద్ద కుటుంబం! కొన్ని ఫిరాయింపులు, దురాశ మరియు వ్యక్తిగత ప్రయోజనాల ఎజెండాను నెరవేర్చడానికి మా గుడ్ గవర్నెన్స్ ఎజెండాను అడ్డుకోలేవు" అని లోబో రాజీనామా తర్వాత సావంత్ ట్వీట్ చేశారు.
ఏదిఏమైనా ఈ సారి బిజెపి నుండి చోటుచేసుకుంటున్న ఫిరాయింపులు ముఖ్యంగా క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళడం బిజెపికి దెబ్బే అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications