వాళ్లు అమాయకులు: గోవా రేప్ కేసు నిందితులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
పనాజీ: ఇద్దరు మహిళా టూరిస్టులు అత్యాచారానికి గురైన సంఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ వివాదాస్పద ప్రకటన చేశారు. టూరిస్టులను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డ వారు అమాయకులని, చిన్న స్థాయి నేరగాళ్లని అన్నారు.
అయితే టూరిస్టులపైనే ఆధారపడి ఉన్న రాష్ట్రంలో ఈ రకమైన సంఘటన జరగడం విచారకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాజా సంఘటనను ఓ అపశ్రుతిగానే ఆయన అభివర్ణించారు.
గత మంగళవారం జరిగిన అత్యాచార సంఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తమను కిడ్నాప్ చేసిన వ్యక్తులు సోమవారం, మంగళవారం తమపై అత్యాచారం చేశారని, తాము ప్రయాణించిన టాక్సీ డ్రైవర్ ఫిర్యాదుతోనే పోలీసులు తమను రక్షించారని బాధిత మహిళలు తెలిపారు.
పోలీసులమని చెప్పిన ఐదుగురు దుండగులు ఇద్దరు యువతులను బెదిరించి వారిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగిన ఇద్దరు యువతులు విహార యాత్ర కోసం గోవాకు వచ్చారు. గత సోమవారం రాత్రి యువతులిద్దరూ ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని అంజునా బీచ్కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఐదుగురు వ్యక్తులు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు.
జరిగిన ఘటనపై ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు ప్లాట్పై దాడిచేసి నిందితులు అర్పోరాకు చెందిన అజయ్ కుస్బాస్(39), కర్వార్కు చెందిన జీవన్ పవర్(26), రాజస్థాన్కు చెందిన నదీమ్ ఖాన్(28), ముంబైకి చెందిన ట్రెబోర్ జోసెఫ్(27), హైదరాబాద్కు చెందిన కుమేష్ చౌదరి(21)లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు వారికి సహకరించిన ఓ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.