గోవా: యువతుల బట్టలూడదీసిన మహిళ, మద్యం తాగించి గ్యాంగ్రేప్, వీడియో తీసి..
పనాజి: ఇటీవల గోవాలో ఇద్దరు ఢిల్లీ యువతులపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించిన పలు దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 18గంటలపాటు తమను లైంగిక వేధించారని బాధిత యువతులు పేర్కొన్నారు. 34, 28ఏళ్ల ఇద్దరు యువతులపై సోమవారం రాత్రి పోలీసులమని చెప్పి ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసు అధికారినంటూ ఆ ఐదుగురు దుండగుల్లో ఒకరైన మహిళ.. అత్యాచారానికి ముందు ఓ ఫ్లాట్కు తీసుకెళ్లి ఆ ఇద్దరు యువతుల బట్టలూడదీసి తనిఖీ చేసింది. ఆ తర్వాత వారికి బలవంతంగా మద్యం తాగించారు. చితకబాది డ్రగ్స్ కూడా ఎక్కించారు.
అనంతరం వారిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో కూడా తీశారు. 18గంటలపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యాంటీ నార్కోటిక్స్ సెల్కు చెందిన పోలీసులమని చెప్పారు. కారును తనిఖీ చేయాలంటూ చెప్పి కారులో, యువతుల బ్యాగుల్లో సోదాలు చేశారు. మార్గమధ్యలో టాక్సీ డ్రైవర్ ఏటిఎం పిన్ నెంబర్ను బలవంతంగా తెలుసుకుని, అతని ఖాతా నుంచి రూ. 10వేలు డ్రా చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగిన ఇద్దరు యువతులు విహార యాత్ర కోసం గోవాకు వెళ్లారు. గత సోమవారం రాత్రి యువతులిద్దరూ ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని అంజునా బీచ్కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఐదుగురు వ్యక్తులు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు.
విచారణ చేయాలంటూ చెప్పి యువతులను వారు ఉండే ప్లాట్కు తీసుకువెళ్లారు. టాక్సీని తమ వద్దే ఉంచుకుంటామని, రూ. 1.5లక్షల ఇచ్చి టాక్సీని తీసుకెళ్లాలని చెప్పి డ్రైవర్ను అక్కడ్నుంచి పంపించేశారు.
అనంతరం యువతులను తీవ్రంగా కొట్టి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు ప్లాట్పై దాడిచేసి నిందితులు అర్పోరాకు చెందిన అజయ్ కుస్బాస్(39), కర్వార్కు చెందిన జీవన్ పవర్(26), రాజస్థాన్కు చెందిన నదీమ్ ఖాన్(28), ముంబైకి చెందిన ట్రెబోర్ జోసెఫ్(27), హైదరాబాద్కు చెందిన కుమేష్ చౌదరి(21)లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు వారికి సహకరించిన ఓ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.